ఎస్‌బీఐ త్రైమాసిక లాభం రూ. 3,581 కోట్లు!

by  |
ఎస్‌బీఐ త్రైమాసిక లాభం రూ. 3,581 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2019-20 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 3,581 కోట్ల నికర లాభాలతో, ఒక త్రైమాసికంలో అత్యధిక లాభాలను నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 838 కోట్లతో పోలిస్తే ఈసారి ఏకంగా 327 శాతం వృద్ధి కావడం విశేషం. ఇక, ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ. 22,767 కోట్లకు పరిమితమవగా, స్థూల మొండి బకాయిలు 6.15 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.23 శాతానికి చేరినట్టు ఎస్‌బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ .98,085 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ .88,349 కోట్లని తెలిపింది. త్రైమాసిక ప్రాతిపదికన, మార్చి త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 3,581 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 838 కోట్లతో పోలిస్తే అధికం. తాజా త్రైమాసికంలో వన్‌టైమ్‌ లాభం రూ. 2731 కోట్లు బ్యాంకుకు అండగా నిలిచాయని, ఐపీవో ద్వారా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఎస్‌బీఐ వాటాను విక్రయించడంతో ఈ నిధులు సమకూరాయని పేర్కొంది.



Next Story