అనిల్‌ అంబానీపై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లిన ఎస్‌బీఐ!

by  |
అనిల్‌ అంబానీపై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లిన ఎస్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు లాగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్‌లకు చెందిన రూ.1,200 కోట్ల రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారని, ఈ రుణాన్ని అతనే చెల్లించాలంటూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. బీఎస్‌వీ ప్రకాష్ కుమార్ అధ్యక్షతన ఎన్‌సీఎల్‌టీ బెంచ్ గురువారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్‌ తరుపున న్యాయవాదులు కొన్ని రోజుల గడువు కోరారు. సానుకూలంగా స్పందించిన బెంచ్ వారికి వారం రోజుల గడువు ఇచ్చింది. ఐబీసీ సెక్షన్ 95(1) కింద కేసు నెంబర్ సీపీ (ఐబీ) నెంబర్ 916, 917 దాఖలు చేయబడిందని, వ్యక్తిగత హామీదారు దివాలా తీర్మానం ప్రక్రియ కోసం అనిల్ అంబానీపై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లింది. ఈ అంశంపై అనిల్ అంబానీ అధికార ప్రతినిధి ఈ-మెయిల్ ద్వారా స్పందిస్తూ.. ఇది రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ రుణాలకు సంబంధించిన విషయమని, అనిల్ అంబానీ సొంత రుణం కాదని తెలిపారు. అనిల్ అంబానీ దీనిపై తగిన విధంగా స్పందిస్తారన్నారు. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఇచ్చిన రుణాలపై వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ దివాళా కేసు ఎన్‌సీఎల్‌టీ విచారణలో ఉంది. వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాలను రాబట్టాలని చూస్తున్నట్టు ఎస్‌బీఐ అధికారి ఒకరు చెప్పారు. వ్యక్తిగత దివాలా కేసులపై నిషేధం లేదు కాబట్టి ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాల్సిందిన ఎన్‌సీఎల్‌టీని కోరినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా వ్యక్తిగత ఖాతాల వివరాలు, వాటి పనితీరు అంశాలపై వ్యాఖ్యానించకూడదనేది బ్యాంకు పాలసీ కాబట్టి పూర్తి వివరాలను తాను వెల్లడించలేనని ఎస్‌బీఐ అధికారి చెప్పారు.


Next Story