ఇకపై శానిటైజ్డ్ డ్రోన్ డెలివరీ?

by  |
ఇకపై శానిటైజ్డ్ డ్రోన్ డెలివరీ?
X

ఢిల్లీలో ఒక పిజ్జా డెలివరీ బాయ్‌ నుంచి కరోనా సోకి ఒక కాలనీ మొత్తం రెడ్ జోన్‌గా మారిన సంగతి గుర్తుంది కదా.. మరి మన దగ్గరికి వచ్చే డెలివరీ బాయ్ సురక్షితంగా ఉన్నాడని ఎలా చెప్పగలం? దీనికి పరిష్కారం డ్రోన్ డెలివరీ. అది కూడా వట్టి డ్రోన్ డెలివరీ కాదు.. శానిటైజ్ చేసిన డ్రోన్ డెలివరీ. జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు తమకు వచ్చే ఆర్డర్ల తాకిడిని తట్టుకునేందుకు ఈ డ్రోన్ డెలివరీ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొత్తగా 13 కంపెనీలకు డ్రోన్ డెలివరీ ప్రయోగాలు చేయడానికి అనుమతులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇవి ఎప్పట్నుంచి వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయో మాత్రం తెలియరాలేదు.

గతంలోనూ ప్రైవేటు సంస్థలకు డ్రోన్ డెలివరీ అనుమతులివ్వడానికి డీజీసీఏ సమ్మతించింది. ఈ మేరకు థ్రోటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్, డుంజో సంస్థలకు గత మార్చిలో అనుమతినిచ్చింది. కొవిడ్ 19 కారణంగా వస్తువుల డెలివరీలు పెరుగుతుండటం, వైరస్ ప్రూఫ్ ప్యాకేజింగ్ అవసరమవుతున్న కారణంగా డ్రోన్ల సాయం అవసరమైంది. అందుకే ఒకేసారి 13 కంపెనీలకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. వీటిలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలతోపాటు షాప్‌ఎక్స్, స్పైస్‌ ఎక్స్‌ప్రెస్, జిప్‌లైన్, రెడ్వింగ్, క్లియర్‌స్కై ఫ్లైట్ సంస్థలు కూడా ఉన్నాయి. జూలై మొదటివారంలో వీళ్లందరూ డ్రోన్ డెలివరీ ట్రయల్స్ ప్రారంభించనున్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా వీరంతా కనీసం 100 గంటల ఫ్లైట్ టైమ్ పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే జొమాటో తన డ్రోన్ ద్వారా జూన్‌లో ఫుడ్ డెలివరీ చేసింది. 5 కేజీల బరువున్న లోడ్‌ని 5 కి.మీ.ల దూరానికి పది నిమిషాల్లో విజయవంతంగా చేర్చింది. ఉత్తరాఖండ్‌లోని ఓ ఆస్పత్రి రక్తనమూనాలను 36 కి.మీ.ల దూరానికి డ్రోన్ ద్వారా విజయవంతంగా చేర్చింది. ఈ లెక్కన చిన్నాచితకా డ్రోన్ ప్రయోగాలు బాగానే జరుగుతున్నాయి. కానీ, వాణిజ్యస్థాయిలో డ్రోన్లు పనిచేయాలంటే వాటికి ఒక నిర్దిష్ట వ్యవస్థ అవసరమవుతుంది.



Next Story