ఇంగ్లండ్ ఆటగాడికి కరోనా టెస్టు

by  |
ఇంగ్లండ్ ఆటగాడికి కరోనా టెస్టు
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్, విండీస్ జట్ల మధ్య మరో ఐదు రోజుల్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. పూర్తిగా బయో సెక్యూర్ చేసిన స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇంతలోనే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రాక్టీస్ గేమ్‌లో పాల్గొని బ్యాటింగ్ కూడా చేసిన కరన్, గురువారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మైదానం వదిలి విశ్రాంతి తీసుకున్న అతను అర్ధరాత్రి డయేరియాతో బాధపడ్డాడు. ఈ నేపథ్యంలో కరన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అతడి కొవిడ్-19 రిపోర్టులు ఇంకా రాలేదని, అప్పటి వరకు జట్టు డాక్టర్ పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటాడని తెలిపింది. ఒకవేళ కరన్‌కు కరోనా పాజిటివ్ తేలితే మిగతా ఆటగాళ్లకు కూడా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు విండీస్ జట్టుతోపాటు రిజర్వ్ ఆటగాడిగా వచ్చిన గాబ్రియెల్ గాయం నుంచి కోలుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అతడిని తొలి టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేశారు.


Next Story

Most Viewed