పట్టపగలే బంగారం షాపులో దోపిడి

by  |
పట్టపగలే బంగారం షాపులో దోపిడి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని విజయవాడ పాతబస్తీ కాటూరివారి వీధిలోని బంగారం షాపులో దొంగతనం జరిగింది. ఈ చోరీలో 7 కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.42లక్షల నగదును దోచుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగల వ్యాపారి శ్యాంకు పాతబస్తీలో జూవెల్లరీ షాపు, కాటూరువారి వీధిలో వెండి వస్తువులు విక్రయించే దుకాణంలో భాగస్వామ్యం ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇద్దరు వ్యక్తులు శివాలయం వీధిలోని జ్యువెల్లరీ షాపు వద్దకు నగలు కొనేందుకు వచ్చారు. లాక్‌డౌన్‌ కావడంతో ఇక్కడ ఉన్న సరకును కాటూరువారి వీధిలోని దుకాణంలో ఉంచామని, కాసేపు వేచి ఉంటే అక్కడి నుంచి తెప్పిస్తామని మరొక వ్యాపార భాగస్వామి మనోహర్‌సింగ్‌ చెప్పారు.

మనోహర్‌సింగ్‌ సూచనల మేరకు గుమాస్తా నగలు తెచ్చేందుకు కాటూరువారి వీధిలోని దుకాణం వద్దకు రాగా అక్కడ ఉన్న దుకాణం గుమాస్తా విక్రంసింగ్‌ అపస్మారక స్థితిలో గాయాలతో కనిపించాడు. వెంటనే అతడు ఈ విషయాన్ని యజమాని మనోహర్‌సింగ్‌కు, ఆయన తన వ్యాపార భాగస్వామికి శ్యాంకు తెలియజేశారు. శ్యాం తోటి వ్యాపారి రాజాసింగ్‌, మనోహర్‌సింగ్‌లను తీసుకొని సంఘటనా స్థలానికి వచ్చారు.
గుమాస్తా విక్రంసింగ్‌ను తీవ్రంగా గాయపర్చిన నలుగురు వ్యక్తులు 7 కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.42లక్షల నగదును దోచుకు వెళ్లినట్టు శ్యాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ సుధాకర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు దోపిడీ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed