‘నిర్వాసితుల విషయంలో వివక్ష తగదు’

by  |
‘నిర్వాసితుల విషయంలో వివక్ష తగదు’
X

దిశ, మహబూబ్‌నగర్: సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపడం తగదని టీపీసీసీ అధికార ప్రతినిధి హనీఫ్ అహమ్మద్ అన్నారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉదండాపూర్ నిర్వాసితులకు మాయమాటలు చెప్పి దీక్ష విరమింప చేశారని, అదే పట్టుదలతో న్యాయమైన పరిహారం ఇప్పించి ఆదుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు ఒక రకమైన ప్యాకేజీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్వాసితులకు ఒక రకమైన ప్యాకేజీ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక ఎకరా మెట్ట పొలానికి రూ.5.5లక్షలు, ఒక ఎకరా తరి పొలానికి రూ.6.5లక్షలు మాత్రమే పరిహారంగా ఇస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో ఎకరా భూమి రూ.50 లక్షలు పలుకుతుంది అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల పరిహారం చెల్లించిన ప్రభుత్వం పాలమూరు రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు పెంచాలని, నిర్వాసితులను సమగ్రంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags : Residents, should be compensated, Palamooru-Rangareddy, Minister Srinivas Goud, TPCC leader Hanif Ahmed



Next Story