వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు!

by  |
వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు!
X

దిశ, వెబ్‌డెస్క్ :
‘బద్రి’ సినిమాతో.. తెలుగు తెరపై మెరిసిన ముంబై ముద్దుగుమ్మ ‘రేణుదేశాయ్’. ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా స్థిరపడింది. ఆ తర్వాత పవన్, రేణులు ఇద్దరూ పరస్పర అంగీకారంతో తమ వైవాహిక బంధానికి బైబై చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ‘జానీ’ సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించని రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. ఇటీవలే ఓ యాడ్‌లోనూ తళుక్కున మెరిసింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో తన రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. రేణునే స్వయంగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు కెమెరా ముందుకొస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.

నటిగా రెండు, మూడు చిత్రాలే చేసిన రేణు.. పూర్తిగా పర్సనల్ లైఫ్‌కే పరిమితమైంది. ఆ తర్వాత తెరమీద కనిపించకపోయినా తెరవెనుక దర్శకత్వం మాత్రం చేసింది. ప్రస్తుతం కూడా రైతు నేపథ్యంలో.. చిన్న పిల్లలతో ఓ సినిమాపై వర్క్ చేస్తున్నట్లు తెలిపింది. దానికి ‘అన్నదాత సుఖీభవ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసింది. మంచి కథ, ప్రాజెక్ట్‌లో అవకాశమొస్తే మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో చెప్పిన రేణు.. 18 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది. అతి త్వరలో తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తానంటూ ఇన్‌స్టా వేదికగా తెలిపింది.

‘ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రావడం ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఓ అందమైన వెబ్‌ సిరీస్‌లో చేసేందుకు సైన్ చేశాను. వచ్చే నెలలో ఈ వెబ్‌ సిరీస్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. నిజాన్ని ఛేదిస్తూ న్యాయం కోసం పోరాడే బలమైన మహిళగా నటించనుండటం చాలా ఎగ్జైయిటింగ్‌గా ఉంది. మీ అందరి నుంచి సపోర్ట్ కావాలి’ అని రేణు తెలిపింది. కృష్ణ‌మామిడాల డైరెక్ష‌న్‌ చేస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను డీఎస్‌.రావు, ఎస్‌.రజనీకాంత్ నిర్మిస్తున్నారు.


Next Story

Most Viewed