మన సంస్కృతికి ఆధునిక చిహ్నం

by  |
మన సంస్కృతికి ఆధునిక చిహ్నం
X

లక్నో: అయోధ్య రాముడి ఆలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ, శతాబ్దాల నిరీక్షణ ముగిసిందని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక రోజున ప్రతి ఒక్కరి హృదయం దేదీప్యమానంగా వెలుగుతోందని, దేశమంతా రామమయమైందని అన్నారు. ఇప్పుడు జై శ్రీరామ్ నినాదాలు కేవలం అయోధ్యలోనే కాదు, యావత్ ప్రపంచమంతటా వినిపిస్తున్నాయని చెప్పారు.

‘కొన్నేళ్లుగా టెంటు కింద ఉన్న బాలరాముడికి రామ భక్తులు ఇప్పుడ భారీ మందిరాన్ని నిర్మించనున్నారు. నేడు రామ జన్మభూమి స్వేచ్ఛపొందిందని తెలిపారు’. ఇంతటి భవ్యమైన రోజును చూడగలుగుతామా అనే సందేహాల్లో ఉన్న కోట్లాది మంది భక్తులు నేడు పరవశించిపోతున్నారన్నారు. జై సీతారామ్ అని నినాదమిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. ఈ మందిరం భారత సనాతన సంస్కృతికి ఆధునిక చిహ్నంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. జాతీయ భావనకు, కోట్లాది మంది దేశ ప్రజల సామూహిక సంకల్ప శక్తికీ ప్రతీకకగా నిలవనుందని తెలిపారు. ఈ ఆలయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని వివరించారు.

బాబ్రీ మసీదు పరోక్ష ప్రస్తావన..

ఇక్కడ ఎన్నోసార్లు కూల్చివేయడాలు, మళ్లీ నిర్మించడాలు జరిగాయని మోడీ అన్నారు. ఇకపై శాశ్వతంగా నిలిచి ఉండే రామ మందిరం నిర్మితమవుతున్నదని తెలిపారు. బాబర్ కాలంలో రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించారనే విషయాన్ని ఆయన పరోక్షంగా ఉటంకించారు. రామ మందిరాన్నే కాదు, ఇక్కడ ఆయన అస్తిత్వాన్నే తుడిచేయాలని తీవ్రప్రయత్నాలు జరిగాయని, కానీ, రాముడు ప్రతి ఒక్కరి గుండెల్లో జీవించే ఉన్నారని అన్నారు.

మన సంస్కృతికి ఆయనే ప్రాతిపదిక అని చెప్పారు. రాముడు అన్ని చోట్లా ఉన్నారని, ఆయన అందరివాడనీ తెలిపారు. అందుకే ఇప్పుడు రామ మందిరం పురుడుపోసుకుంటున్నదని తెలిపారు. అదే ఆయన గొప్పతనమని అన్నారు. రామ మందిర ఉద్యమాన్ని స్వాతంత్ర్యోద్యమంతో మోడీ పోల్చారు. ఎందరో మంది తమ ప్రాణాలను బలిదానం చేసి బానిసత్వం నుంచి స్వేచ్ఛను కల్పించారని, అలాగే, రామ మందిర కల సాకారానికి ఎందరో మంది భక్తులు తమ ప్రాణాలను వదిలిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

500 ఏళ్ల పోరాట ఫలితం: యూపీ సీఎం

ఇది చారిత్రాత్మక ఘట్టమని, దశాబ్దాల నిరీక్షణ ముగిసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. దాదాపు 500 ఏళ్ల పోరాటాన్ని భారత న్యాయవ్యవస్థ, రాజ్యాంగం ఆమోదించాని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామిక విలువలు, న్యాయవ్యవస్థ ఒక సమస్యను శాంతియుతంగా ఎలా పరిష్కరించవచ్చునో ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రపంచానికి చూపించాయని వివరించారు.

కాగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఎల్‌కే అడ్వాణీని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇక్కడికి ఆహ్వానించలేకపోయిన, లేదా ఇక్కడికి రాలేకపోయిన వారెందరో ఉన్నారు. అడ్వాణీ బహుశా ఈ వేడుకను చూస్తూ ఉన్నారేమో? అని అన్నారు. ఎందరో మంది ఈ రోజు కోసం ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. రామ మందిర పోరాటంలో పాల్గొన్న వారిని ప్రశంసించారు.

రామరాజ్యానికి నిదర్శనం: రాష్ట్రపతి

రామమందిర నిర్మాణానికి శంకుస్థాపనను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. చట్టబద్ధంగా నిర్మితమవుతున్న ఈ మందిరం భారత ప్రజల సామరస్యం, గాఢమైన ఆశయాన్ని వెల్లడిస్తున్నదని వివరించారు. రామరాజ్యానికి, ఆధునిక భారతానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed