ఆర్ఆర్ఆర్ భవిష్యత్తు ఏ మలుపు తిరుగునో?

by  |
MP Raghurama krishnamraju
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాజకీయ భవిష్యత్ మలుపులు తిరుగుతోంది. సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలతో గత నెల రోజులుగా మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచిన రఘురామకృష్ణం రాజు వ్యవహారం తేల్చేయడానికి ఆ పార్టీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడంతో వివాదం మరింత వేడిరగిల్చింది. ఎంపీలు విమానంలో బయల్దేరగానే రఘురామకృష్ణం రాజు రంగంలోకి దిగి పార్టీ తనపై చర్యలు తీసుకోకుండా నిలువరించాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో వివాదం మరింత ముదురుతోంది.

బీజేపీవైపు చూస్తున్న రఘురామకృష్ణం రాజు పార్టీలో ఆది నుంచి వివాదాస్పద వైఖరిని ఎంచుకున్నారు. ఎంపీ కావడంతో రాష్ట్రంతో పెద్దగా పనిలేదనుకున్న ఆయన టీటీడీ నిరర్ధక ఆస్తుల వేలం నుంచి విమర్శలు గుప్పించడం ఆరంభించారు. పార్టీ నేతలు వ్యతిరేకించడాన్ని ఊహించని ఆయన, దానిని జీర్ణించుకోలేకపోయారు. దీంతో జగన్ ఛరిష్మాతో తనకు పని లేదని, తానే వైఎస్సార్సీపీకి బలమని, తనకు పార్టీతో పని లేదని, జగన్‌ను తాను కనీసం కలవడానికి కూడా ఇష్టపడలేదని, అందుకే ఎయిర్ పోర్టులో కలిశానంటూ విమర్శలు చేశారు. దీంతో పార్టీలో ఆయనపై ఆగ్రహం వ్యక్తమయింది.

దీంతో అవినీతి పరులు, కబ్జా కోరులంటూ నియోజకవర్గ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనకు సొంత పార్టీ నుంచే నియోజకవర్గంలో సెగ తగిలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు రిజిస్టర్ కాకపోవడంతో ఆయన విమర్శల తీవ్రత పెంచారు. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ అయింది. ఇక్కడ ఫలితం లేదని భావించిన ఆయన హస్తినకు వెళ్లి పార్టీ మనగడపై విమర్శలు చేశారు. ఒకవైపు పార్టీపై, అధినేతపై విమర్శలు చేయలేదంటూనే పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో పార్టీ తనను సస్పెండ్ చేస్తే నేరుగా బీజేపీలో కలవాలని భావిస్తున్నారని సొంత నియోజకవర్గంలో గుసగుసలు వినిపించాయి.

ఆయన ఆలోచనలు గ్రహించిన పార్టీ కొత్త వ్యూహాన్ని అమలు చేయడం ఆరంభించింది. ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా నేరుగా ఎంపీలను లోక్‌సభ స్పీకర్ దగ్గరకి పంపింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనని స్పీకర్‌కి వివరిస్తూ, న్యాయసహాయం తీసుకుంటూనే ఆయనను లోక్‌సభ్యత్వానికి అనర్హున్ని చేయాలని కోరారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంటులోని పెద్ద పార్టీలో ఒకటైన వైఎస్సార్సీపీ బీజేపీకి వ్యూహాత్మక మద్దతుదారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

మరోవైపు ఏపీలో బీజేపీ బలంగా పాతుకుపోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీపై సూటిగా విమర్శలు చేయగల, ఛరిష్మాగలిగిన నేతలు కావాలి దీంతో రఘురామకృష్ణం రాజును బీజేపీ ఆహ్వానిస్తుందని అంచనా వేస్తున్నారు. అలా జరిగితే టీడీపీ, జనసేన, వామపక్షాల మద్దతుతో విజయం సాధించవచ్చని రఘురామకృష్ణం రాజు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ మాత్రం రఘురామకృష్ణం రాజుపై తీసుకునే చర్యల ద్వారా సమాధానం చెప్పాలని వ్యూహం రచించింది. దీనిని గ్రహించిన రఘురామకృష్ణం రాజు అప్పుడప్పుడు మెతక వైఖరి వ్యవహరిస్తున్నప్పటికీ.. పూర్తిగా నిర్లక్ష్యానికి గురౌతానన్న ఆందోళనతోనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story