రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

by  |
రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
X

న్యూఢిల్లీ: కరోనా అనంతరం తీవ్ర పరిణామాలను ఇరుదేశాలు కలిసి ఎదుర్కోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు అంగీకరించారు. సంయుక్తంగా ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. రష్యా రాజ్యాంగ సవరణలకు ఆమోదం లభించినందుకు, 75వ విక్టరీ పరేడ్ దినోత్సవాల సందర్భంగా పుతిన్‌కు ఫోన్ చేసి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగ సవరణలతో పుతిన్ రష్యా అధ్యక్షుడుగా 2036 వరకు కొనసాగవచ్చు. ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరగనున్న వార్షిక ద్వైపాక్షిక చర్చల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు మోడీ పేర్కొన్నారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ చర్చల సందర్భంగా పుతిన్ భారత్ పర్యటించనున్నారు. వార్షిక ద్వైపాక్షిక చర్చల కోసం అప్పటి వరకు సంప్రదింపులు, సంభాషణలు కొనసాగాలని ఇరుదేశాల నేతలు అంగీకరించినట్టు పేర్కొంది. కాగా, భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉన్నదని పుతిన్ తెలిపారు. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామిగా బంధాలు ఎదగాల్సి ఉన్నదని పునరుద్ఘాటించారు. తనకు ఫోన్ చేసినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు.


Next Story

Most Viewed