పీపీ15 నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి!

by  |
పీపీ15 నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి!
X

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణ కొనసాగుతున్నది. సోమవారం మొదలైన ఈ ప్రక్రియ సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన హాట్‌స్ప్రింగ్ ఏరియాలోని ప్యాట్రోల్ పాయింట్ 15 దగ్గర పూర్తయింది. ఈ పాయింట్ నుంచి ఇరుదేశాల సైన్యం కనీసం రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాయి. కాగా, గోగ్రా లేదా ప్యాట్రోల్ పాయింట్ 17ఏ నుంచి ఇరువైపుల 2 కిలోమీటర్ల మేర బలగాల ఉపసంహరణ గురువారం వరకు పూర్తి కానుంది. ప్యాంగాంగ్ సరస్సు దగ్గరలోని ఫింగర్ 4 ఏరియాలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉపసంహరణ కదలికలు మొదలయ్యాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రాంతంలో చైనా ఆర్మీ టెంట్లు తొలగించాయని, వాహనాలు వెనక్కి వెళ్లాయని, అయితే, శిఖరం పక్కనే సమాంతరంగా ఉన్న భూభాగంలో డ్రాగన్ సైన్యం ఇంకా అలాగే ఉన్నదని తెలిపాయి. జూన్ 15న హింసాత్మక ఘటన జరిగిన గాల్వన్ లోయ ప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ మంగళవారం పూర్తయినట్టు తెలిసింది. ఆ ఏరియాలో ఏర్పరుచుకున్న గుడారాలు ఇప్పుడు శాటిలైట్ చిత్రాల్లో కనిపించలేదు. ప్రస్తుతం చైనా ఆర్మీ యధాతథ స్థితి వాస్తవాధీన రేఖకు అవతలివైపునే ఉన్నదని సమాచారం. ఘర్షణల అనంతరం లడాఖ్‌లోని నాలుగు ప్రాంతాలు గాల్వన్ లోయ, హాట్‌స్ప్రింగ్స్, గోగ్రా, ప్యాంగాంగ్‌లోని ఫింగర్ ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ మొదలైంది. ఏప్రిల్‌లో మొదలైన ఉద్రిక్తతలు వెంటనే తగ్గించి సరిహద్దులో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఇరుదేశాలు చర్చల్లో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బలగాల ఉపసంహరణ చేపడుతున్నాయి.


Next Story