మచిలీపట్నంలో హైటెక్ వ్యభిచారం

by  |
మచిలీపట్నంలో హైటెక్ వ్యభిచారం
X

దిశ ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హైటెక్‌ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రపంచం మొత్తం కరోనా బారినపడి విలవిలలాడుతుంటే.. ఇక్కడ వ్యభిచారం మాత్రం కొత్తపుంతలు తొక్కుతోంది. హోటల్స్, అపార్టుమెంట్లు, నగర శివారుల్లోని ఇండిపెండెంట్‌ హౌస్‌లలో ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వాట్సప్‌లలో అమ్మాయిల ఫొటోలు పంపడం.. నచ్చితే కోరుకున్న సమయానికి కోరుకున్న చోటకు అరగంటలో పంపడం ఇక్కడ స్పెషాలిటీ అంటే ఆశ్చర్యం కలుగకమానదు.

గంటలు.. రోజుల చొప్పున వారిని బుక్ చేసుకుంటున్నారట. దీనికి గంటకు 3 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయలు వరకు, ఒక రాత్రికి 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వెచ్చించి మరీ బుక్ చేసుకోవడం విశేషం. ఇక హౌసింగ్‌ బోర్డు కాలనీ, భాస్కరపురం ప్రాంతాల్లో ఇండిపెండెంట్ అపార్టుమెంట్‌లలో ఈ తరహా వ్యభిచారం ఊపందుకుందని తెలుస్తోంది. ఇందులో 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతులను విజయవాడ, గుడివాడ తదితర పట్టణాల నుంచి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

కొన్ని హోటల్స్‌ ఈ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారుతున్నాయనేది పోలీసుల ఆరోపణ. ముఖ్యంగా నగరం నడిబొడ్డులోని ఓ ప్రముఖ హోటల్‌ ఈ వ్యాపారానికి అడ్డాగా మారింది. ఈ హోటల్‌లో ఈ వ్యాపారం కోసం కొన్ని రూమ్‌లు రిజిస్ట్రర్‌ చేయకుండా అన్‌రిజిస్ట్రర్‌ కోటాలో వదిలేస్తారంటే వ్యాపారం ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అంతే కాకుండా ఈ హోటల్‌లో ఐదారుగురు అమ్మాయిలు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, వారిని బుక్‌ చేసుకుంటే హోటల్‌లో రూమ్‌ కూడా ఫ్రీ అని తెలుస్తోంది. యువత లక్ష్యంగా ఈ వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఓ చానల్‌లో పనిచేసే సిబ్బంది ఒకరు తన ఇంట్లోనే వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ ముందుకంటే ఇప్పుడే వ్యాపారం బాగుందని దీని గురించి తెలిసిన ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.



Next Story