కరోనా పేరుతో దోచుకుంటున్నారు..!

by  |
కరోనా పేరుతో దోచుకుంటున్నారు..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్:

కరోనా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చెప్పలేనంతా భయాన్ని రేకేత్తిస్తోంది. అయితే ఈ భయాన్ని ప్రైవేటు ల్యాబ్ లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు సొమ్ము చేసుకుంటున్నాయి. వైరస్ నిర్ధారణలో కచ్చితత్వం కోసం సీటి స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని వాటి నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. కరోనా కష్టకాలంలో కాసుల కోసం కక్కుర్తిపడుతూ.. రేట్లను అమాంతం పెంచేశారు.

రెట్టింపు వసూళ్లు..

గ్రేటర్ హైదరాదాద్ తోపాటు శివారు జిల్లాల్లో కరోనా రోజురోజుకూ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నది. వైరస్ ఏ వైపు నుంచి సోకుతుందోననే టెన్షన్ ప్రజలను పట్టుకుంది. ఏ ఒక్కరికి సోకినా..కుటుంబమంతా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, దీంతో కొంతమందిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా..పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. పాజిటివ్ అని తేలితే సెకండ్ ఒపినియన్ కోసం తెలిసిన వైద్యులను సంప్రదించిస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి స్పష్టత కోసం ఊపిరితిత్తులకు సీటి స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ల్యాబ్ లు, స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ధరలను ఇష్టానుసారంగా పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు.

కరోనాకు ముందు సికింద్రాబాద్ కు చెందిన ఓ ల్యాబ్ లో రూ.2,800 మాత్రమే ఉన్న సీటి స్కాన్ కు ఇప్పుడు రూ.3,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా స్కానింగ్ కు వెళ్లే వారికి పీపీఈ కిట్, ఎస్ -95 మాస్క్ తప్పనిసరి అని షరతు విధిస్తున్నాయి. దీంతో అప్పటికప్పుడు వాటిని ఎక్కడ కొనుగోలు చేయాలో తెలియక సిబ్బందిని నిర్వాహకులను అడిగితే అదనంగా రూ. వెయ్యి చెల్లిస్తే తామే సమకూరుస్తామంటూ దోపిడీకి తెగిస్తున్నారు.

స్పష్టత కోసమే..

తీవ్రమైన లక్షణాలు కలిగి ఉండి కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారే సీటి స్కాన్ చేయించుకోవాలి. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉందా..? లేదా..? ఒకవేళ ఉంటే ఏస్థాయిలో ఉందనేది స్కానింగ్ లో తెలుస్తుంది. ఆ రిపోర్టు ద్వారా అవసరమైన వైద్యం అందించేందుకు ఉపయోగపడుతుంది.

– డాక్టర్ కిశోర్ కుమార్, గాంధీ వైద్యుడు


Next Story

Most Viewed