మూడో దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

by  |
మూడో దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”
X

దశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మూడో దశను హీరో ప్రభాస్ గురువారం ప్రారంభించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని అన్నారు. దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్యక్రమం నన్ను ఇన్ స్పైర్ చేసిందన్నారు. అందుకే ఎక్కడ సూచిస్తే అక్కడ వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించకున్నట్లు ప్రకటించారు. మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బావుంటుందని నా భావన అని అన్నారు. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు కలిగిన వారని, సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని కొనియాడారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్ఫూర్తిదాయమన్నారు. కోట్లాదిగా ఉన్న వారి అభిమానులంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సమన్వయకర్త సంజీవ్ రాఘవ పాల్గొన్నారు.


Next Story

Most Viewed