దొంగను పట్టించిన లొకేషన్

by  |
దొంగను పట్టించిన లొకేషన్
X

దిశ,సిద్దిపేట:
ఆరు నెలల కిందట పోయిన మొబైల్ ను లొకేషన్ ట్రాక్ ద్వారా పట్టుకుని బాధితునికి పోలీసులు అప్పగించారు. ఈ ఘటన సిద్దిపేటలో జరిగింది. సీఐ సైదుల తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట పట్టణానికి చెందిన కడవేర్గు యాష్, మార్చి 23న హైదరాబాద్ నుండి సిద్దిపేటకు బస్సులో వచ్చాడు. కాగా సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్‌లో దిగిన తర్వాత చూసుకోగా ఫోన్ కనపడలేదు. వెంటనే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బస్టాండ్ ఆవరణలో తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫోన్‌ను వన్ టౌన్ సీఐ సైదులు ట్రాకింగ్ లో పెట్టారు.

కాగా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం వాసర తండాలో ఆ ఫోన్ ఉన్నట్టు టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు బుధవారం తెలుసుకున్నారు. దీంతో రాంజీ అనే కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి అతన్ని విచారించాడు. అయితే బీహెచ్ఈఎల్ లింగంపల్లి వద్ద తనకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రూ. 4 వేలకు ఫోన్‌ను అమ్మినట్టు తెలిపారు. దీంతో అతని వద్దనుండి ఫోన్ స్వాధీనం చేసుకొని సీఐ సైదులు సమక్షంలో బాధితుడికి ఫోన్ అప్పగించారు. ఆరు నెలల క్రితం పోయిన తన ఫోన్ ను వెతికి పట్టుకొని అప్పగించినందుకు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు యాష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సైదులు మాట్లాడుతూ… గుర్తుతెలియని వ్యక్తుల వద్ద బిల్లు లేని ఫోన్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని సూచించారు.


Next Story