అర్థరాత్రి మహిళా అధికారి తెగువా.. అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

by  |
అర్థరాత్రి మహిళా అధికారి తెగువా.. అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
X

దిశ, హుజురాబాద్: ఓ వైపును జోరుగా కురుస్తున్న వాన. మరో వైపున ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. గజగజ వణికిస్తున్న చలి నుండి తప్పించుకునేందుకు ముసుగు తన్ని గాడ నిద్రలో ఉంటారు ప్రతి ఒక్కరు. ఆ సమయంలోనే ఆ అధికారి ఫోన్ రింగయింది… ఇప్పుడెవరా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశారు. అంతే అటువైపు నుండి ఠకఠకా మాటలు వినిపించాయి. ‘మేడం నేను జూపాక వెళ్తున్నాను.. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గమనించకుండా వెళ్లాను. నీటిలో చిక్కుకపోయాను. కాపాడండి మేడం ప్లీజ్’ అని అన్నాడు. అంతే ఆ అధికారి వెంటనే నిద్ర నుండి తేరుకుని స్టేషన్ కు ఫోన్ చేసి సిబ్బందిని అలెర్ట్ చేసి ఘటనా స్థలానికి వెళ్లి అతన్ని కాపాడారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో ఈ సంఘటన చోటు చేసకుంది. శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జూపాక గ్రామానికి చెందిన గిన్నారపు మహేందర్ (30) హుజురాబాద్ నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు. వాన నీరు ఉధృతంగా రోడ్డుపై ప్రవహిస్తున్న విషయాన్ని అంచనా వేయకుండా వెళ్లి మధ్యలో చిక్కుకున్నాడు. క్షణక్షణం వరద ఉధృతి పెరుగుతుండటంతోపాటు తెల్లవారు జామున కావడంతో ఆ ప్రాంతంలో తనను కాపాడే వారు లేరని భావించిన మహేందర్ హుజురాబాద్ సీఐ వి. మాధవికి కాల్ చేసి తన పరిస్థితి వివరించాడు. వెంటనే స్పందించిన మాధవి సిబ్బందిని వెంటబెట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకుని తాడు సహాయంతో యువకుడిని రక్షించి, పోలీసు వాహనంలోనే ఇంటి వద్ద దింపి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే వరద ధాటికి మహేందర్ ప్రయాణిస్తున్న బైక్ కొట్టుకుపోయింది. ధైర్య సాహసాలు ప్రదర్శించి వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకుడిని రక్షించిన ఇన్స్పెక్టర్ మాధవిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అభినందించడంతోపాటు యువకుడిని కాపాడిన పోలీసులకు రివార్డులను ప్రకటించారు. హుజురాబాద్ ఇన్స్పెక్టర్ మాధవి, ఇతర పోలీసుల పేర్లను రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డుల ఎంపిక కోసం ప్రతిపాదనలు పంపించనున్నామని కమిషనర్ తెలిపారు.


Next Story