పండగ ఇక్కట్లకు.. పోలీసుల ఆంక్షలు

by  |
పండగ ఇక్కట్లకు.. పోలీసుల ఆంక్షలు
X

అసలే పండగ.. పుణ్యక్షేత్రాలు నదీ, సముద్ర తీరాలకు క్యూకట్టిన భక్తులు.. కిక్కిరిసిన రోడ్లకు తోడు పోలీసుల ఆంక్షలు. భద్రతా ఏర్పాట్ల పేరిట పోలీసుల వ్యవహారశైలి మహిళలు, పిల్లలు, వృద్ధలను అగచాట్లపాలు చేసింది.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. భీమేశ్వరుడు కొలువైన శ్రీశైలం, కుమారారామంగా పిలుచుకునే సామర్లకోట, రామలింగేశ్వరుడు కొలువైన ద్రాక్షారామం, సోమేశ్వరుడు కొలువైన భీమవరం, అమరేశ్వరుడు కొలువైన అమరావతిల్లోని పుణ్యక్షేత్రాలతో పాటు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్టణం, పుణ్యగిరి వంటి శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేశారు. దీంతో భక్తులు నిరాశచెందారు. పార్కింగ్‌ దూరంగా ఏర్పాటు చేయడంతో పూజాసామగ్రితో అభిషేకించేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కనిపించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తవహిస్తున్నారు.

ఎక్కడికక్కడ పికెట్‌లు ఏర్పాటు చేశారు. నదీ, సముద్రతీర ప్రాంతాల్లో గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. లౌడ్ స్పీకర్లలో భద్రతా ప్రమాణాలు, చోరీల గురించిన ప్రకటనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పని చేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి శివరాత్రి శోభ తగ్గుతుందని అంతా భావిస్తున్నారు.


Next Story

Most Viewed