24 గంటల పని..12గంటల వేతనం

by  |
24 గంటల పని..12గంటల వేతనం
X

న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా ఓ కాంప్లెక్స్‌ను సీల్ చేసే సమయంలో..అందులో నివసిస్తున్నవారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చెలరేగింది.ఆ కాంప్లెక్స్ వాసులు తమ ఉద్యోగాల కోసం ఆందోళన వ్యక్తం చేయగా పోలీసులూ తమ బాధ్యతలను వివరించారు. సమయస్ఫూర్తిగా ఆందోళన కారులను ఒప్పించి కాంప్లెక్స్‌ను సీల్ చేశారు. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నది. గ్రేటర్ నోయిడాలోని సూపర్‌టెక్ ఇకోవిలేజ్ వన్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్తగా ఆ కాంప్లెక్స్ మొత్తాన్ని సీల్ చేయడానికి పోలీసులు ఉపక్రమించారు.కానీ, అందులోని ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇప్పుడిప్పుడే తమ ఆఫీసులు ఓపెన్ అయ్యాయనీ, తామంతా విధులకు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కావాలంటే కరోనా పేషెంట్ నివసిస్తున్న ఒక్క బిల్డింగ్‌ను మాత్రమే సీల్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో పోలీసులు అక్కడి వారితో సరైన రీతిలో స్పందించారు. ‘మేమంతా ఇప్పుడు మీ ముందు నిలుచున్నాం. మేం కూడా మా ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ జాబ్. 12 గంటల వేతనం కోసం 24 గంటలు డ్యూటీలోనే ఉంటున్నాం. ఇప్పుడు కూడా కరోనా నివారణకు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నాం. మాతో వాదించాలనే ఎవరైనా భావిస్తే ముందుకు రండి’ అని ఓ పోలీసు అధికారి మైక్‌లో జవాబిచ్చాడు. కాగా, ఎదుటి గుంపులో నుంచి ‘సార్ మేం ఆకలితో మరణించాల్సి వస్తుంది’ అని ఓ గొంతు వినిపించింది.ఈ మాటకు ప్రతిస్పందనగా.. ‘మీరు కావాలనుకుంటే జిల్లా మెజిస్ట్రేటుతో మాట్లాడవచ్చు. మీకు ఆ బాధ ఉండకుండా వారు చూస్తారు.మేం వలస కార్మికులనూ ఆకలితో మరణించకుండా చూసుకోగలిగాం’ అని వివరించడంతో ఆందోళన సద్దుమణిగింది.ఎట్టకేలకు పోలీసులు సూపర్‌టెక్ ఇకోవిలేజ్ వన్ కాంప్లెక్స్ పూర్తిగా సీల్ చేశారు.


Next Story