మార్కు షీట్లు తొలగించే లక్ష్యంతో ఎన్‌ఈపీ

by  |
మార్కు షీట్లు తొలగించే లక్ష్యంతో ఎన్‌ఈపీ
X

న్యూఢిల్లీ: మార్కు షీట్లు తల్లిదండ్రులకు ప్రతిష్టను తెచ్చిపెట్టేవిగా మారాయని, విద్యార్థులకు ఒత్తిడి పెంచే షీట్లుగా మారాయని ప్రధాని మోడీ అన్నారు. విద్య నుంచి అంచనాలు కల్పించే ఇలాంటి పరీక్షలను తొలగించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాటుపడాలని పిలుపునిచ్చారు. జాతీయ నూతన విద్యా విధానం (NEP)పై ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించిన రెండు రోజుల సెమినార్‌లో ప్రధాని మోడీ శుక్రవారం మాట్లాడారు. ఎన్‌ఈపీ పరీక్షలు సృష్టించిన లోపాన్ని గుర్తించిందని, వీటి నుంచి దూరంగా జరిగి స్వీయ సమీక్ష లేదా నిపుణుల సమీక్షలను ప్రవేశపెడుతుందని తెలిపారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ, ‘నేడు పిల్లలు బడుల్లో ఏం నేర్చుకున్నారని తల్లిదండ్రులు అడగటం లేదు. దానికి బదులు టెస్టులో సాధించిన మార్కులను అడుగుతున్నారు. ఈ మార్కుషీట్లే కుటుంబ ప్రతిష్ఠగా, విద్యార్థులకు ఒత్తిళ్లకు కారణంగా మారాయి. ఎన్‌ఈపీ విద్యార్థుల్లో ఈ ఒత్తిడిని తొలగిస్తుంది. జపాన్, ఎస్టోనియా, ఫిన్లాండ్ లాంటి దేశాలు ఇలాంటి పరీక్షలను నిలిపేసి ప్రొగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్‌ను అమలు చేస్తున్నాయి’ అని అన్నారు.

‘మాతృభాషలో బోధనతో విద్యార్థులు సులువుగా నేర్చుకోగలుగుతారు. వేరే భాషలో బోధన పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఒక గోడలా ఏర్పడుతుంది. పిల్లలు ఏం నేర్చుకున్నారో పేరెంట్స్ తెలుసుకోలేకపోతారు. అందుకే కనీసం ఐదో తరగతి వరకైనా తప్పనిసరిగా మాతృభాషలో బోధనను అమలు చేయాలి. అయితే, ఎన్‌ఈపీ ఆంగ్లం సహా ఇతర విదేశీ భాషలను నేర్చుకోకుండా అడ్డుకోదు’ అని వివరించారు.

‘కనీసం చదివే నైపుణ్యాన్ని ఒంటబట్టిచ్చుకోవడం కీలకం. ప్రాథమిక స్థాయిలోనే సరైన బోధన ఉంటే చదవడాన్ని నేర్చుకోవడం నుంచి నేర్చుకోవడానికి చదవడం వరకు ప్రయాణం సాగుతుంది. మూడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నిమిషానికి 30 నుంచి 35 పదాలు ఈ విధానంలో చదివిస్తాం. దీంతో చదవడంలో వేగం పెరుగుతుంది. దీంతో ఇతర సబ్జెక్టుల విషయాన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతారు’ అని అన్నారు.



Next Story

Most Viewed