సినిమాను తలపిస్తున్న ‘యూపీ గ్యాంగ్’ ఫైరింగ్

by  |
సినిమాను తలపిస్తున్న ‘యూపీ గ్యాంగ్’ ఫైరింగ్
X

లక్నో: యూపీ గ్యాంగ్ ఫైరింగ్‌లో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పోలీసులకు చిక్కిన ముఠా సభ్యుడు, క్రిమినల్ వికాస్ దుబే అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపెట్టాడు. వికాస్ దుబే అరెస్టు ప్లాన్ ముందుగానే లీక్ అయిందని, చౌబేపూర్ పీఎస్ నుంచే దుబేకు ఫోన్ వచ్చిందని చెప్పాడు. ప్లాన్‌కు సంబంధించి వార్నింగ్ కాల్ వచ్చిన తర్వాతే వికాస్ దుబే సుమారు 30 మందిని కూడగట్టుకున్నాడని, ఆ తర్వాత దాదాపు 50 మందితో కూడిన పోలీసు బృందం స్పాట్‌కు చేరగానే బుల్లెట్ల వర్షం కురిపించారని వివరించాడు. అంతేకాదు, చౌబేపూర్ పోలీసు స్టేషన్ నుంచే సమీపంలోని పవర్ సబ్‌స్టేషన్‌కు ఫోన్ వెళ్లిందని, కరెంట్ కట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు ఆపరేటర్ తెలిపాడు. కాగా, ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు నిర్వహిస్తామని, డిపార్ట్‌మెంట్ హస్తమున్నా చేధిస్తామని కాల్పులు జరిగిన రోజే ఉన్నత పోలీసు అధికారి ఒకరు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీసుల నుంచి గ్యాంగ్‌స్టర్‌కు ఇన్‌పుట్లు వెళ్లాయన్న కోణంలోనూ రాష్ట్ర పోలీసులు విచారణ జరిపారు. ఇందులో భాగంగా చౌబేపూర్ పీఎస్ ఇన్‌చార్జీ రాహుల్ తివారీపై మొదటి వేటుపడింది. వికాస్ దుబేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ససేమిరా అన్న తివారీ, దుబేను అరెస్టు చేయడానికి వెళ్తున్న బృందం నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతన్ని సస్పెండ్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన పోలీసుల పోస్టుమార్టం రిపోర్టులోనూ కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్పీ దేవేంద్ర మిశ్రా బాడీలో మొత్తం ఐదు బుల్లెట్లు దిగాయి. అంతేకాదు, గొడ్డలితో వేటు వేసిన గాయాల గుర్తులున్నట్టు తేలింది. వికాస్‌‌ దుబేపై కేసు ఫైల్ చేసిన మిశ్రాను ఓ ఇంటిలోకి లాక్కెళ్లి చంపేశారు. మరో పోలీసు అధికారి మహేష్ యాదవ్ దేహంలో 8 నుంచి 9 బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. ఒక పోలీసు అయితే తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు.


Next Story

Most Viewed