31 ఏండ్ల తర్వాత ఆ చెరువు.. అలుగు పారుతోంది

by  |
31 ఏండ్ల తర్వాత ఆ చెరువు.. అలుగు పారుతోంది
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలోని పెదరాయ చెరువు సుమారు 31 సంవత్సరాల అనంతరం అలుగు పారుతుంది. 31 ఏండ్ల నుంచి ఈ చెరువు జలకళ కోసం ఇక్కడి రైతులు ఎదురు చూశారు. ఈ కళను మంత్రి హరీష్ రావు నిజం చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రెండు నెలల క్రితం కాలేశ్వరం జలాలతో రాజగోపాల్‌పెద్ద చెరువు నింపారు.

కాలేశ్వరం జలాలకు తోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పెద్దచెరువు మత్తడి దూకుతూ అలుగు పారుతుంది. ప్రభుత్వం సుమారు కోటిన్నర ఖర్చు చేయడంతో చెరువుకు జలకళ వచ్చిందని గ్రామస్తులు సంబురపడుతున్నారు. ఈ చెరువు సుమారు 580 ఎకరాల విస్తీర్ణంతో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ చెరువు సమీపంలోని బీడు భూములన్నీ ఆకుపచ్చగా మారాయి.

చెరువు నిండు కుండల మత్తడి దూకడంతో గంగమ్మతల్లికి గ్రామస్తులు జల హారతి నిర్వహించారు. అలుగు వద్ద యువతీ, యువకులు పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగుతూ, ఈతలు కొడుతూ ఆనందంలో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… ‘‘మా చిన్నతనం నుంచి ఈ చెరువు మత్తడి దూకడం ఇదే మొదటిసారి చూస్తున్నాము. అది కూడా మంత్రి హరీశ్ రావు కృషితోనే ఇది సాధ్యమైంది.’’ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Next Story