ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వనున్న ఓయో!

by  |
ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వనున్న ఓయో!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హాస్పిటాలిటీ స్టార్టప్ కంపెనీ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ లిమిటేడ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది. రానున్న రోజుల్లో నెమ్మదిగా ఉద్యోగాలకు పూర్తిస్థాయి జీతాలను ఇవ్వనున్నట్టు తెలిపింది. కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల దేశీయంగానూ, అంతర్జాతీయంగాను వివిధ రంగాల్లో పలు కంపెనీలు 5 శాతం నుంచి 30 శాతం వరకు వేతనాల్లో కోతను విధించాయి. ఆతిథ్య రంగం తీవ్రంగా దెబ్బతినడంతో ఓయో హోటల్స్ కూడా ఇటీవల ఉద్యోగుల జీతాల్లో కోతను విధించిన సంగతి తెలిసిందే.

భారత్ సహా దక్షిణాసియాలో ఉన్న తమ ఉద్యోగులకు ఆగస్టు నెల నుంచి పూర్తి జీతం ఇస్తామని ఓయో ప్రకటన విడుదల చేసింది. రూ. 8 లక్షల వార్షిక వేతనం కలిగిన ఉద్యోగులకు ఆగస్టు నుంచి పూర్తి వేతనం ఉంటుందని, మిగిలిన వారికి దశలవారీగా వేతన్నాల కోతను తగ్గించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ నుంచి 25 శాతం వేతన కోత ఉన్న వారికి 12.5 శాతానికి తగ్గిస్తామని, మిగిలిన 12.5 శాతాన్ని డిసెంబర్ నుంచి పునరుద్ధరించబడుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

గతంలో కరోనా విజృంభనతో మే నెల తర్వాత నుంచి 4 నెలల వరకు కొందరు ఉద్యోగులను సెలవులపై పంపించింది. ఏప్రిల్ 22న కంపెనీ ఈ మేరకు ఉద్యోగులను కోరింది. దీంతో ఏప్రిల్ నుంచి జులై నెలల్లో ఉద్యోగుల జీతాల్లో 25 శాతం కోతను విధించింది. కాగా, దక్షిణాసియా, భారత్‌లో ఓయో మొత్తం వర్క్ ఫోర్స్‌లో సుమారు 60 శాతం ఇక్కడే ఉంటారు. దీంతో వీరందరికి కొంత ఊరట లభించనుంది.


Next Story

Most Viewed