పంజాబ్‌లో మళ్లీ కఠిన ఆంక్షలు

by  |
పంజాబ్‌లో మళ్లీ కఠిన ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్‌ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నది. మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ కఠిన ఆంక్షలు విధించింది. శుక్రవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చారు. రాత్రి 7గంటల నుంచి తెల్లవారుజామున 5గంటలకు అన్నిరకాల కార్యకలాపాల స్తంభించిపోనున్నాయి. మరోవైపు 167 పట్టణాలు, నగరాల్లో వారాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.

ప్రజలు ఒక్కచోట గుమిగూడటంపై (వివాహాలు, అంతిమయాత్రలు) నిషేధం అమలులో ఉంటుంది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాల్లో నిత్యావసరాలు మినహా ఇతర దుకాణాలు 50శాతం మూసి ఉంచాలని ఆదేశించారు. ఈ నెల 31 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌పై నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి. 50శాతం సామర్థ్యంతో ప్రజా రవాణా కొనసాగనుండగా, ముగ్గురు ప్రయాణికులతో ప్రైవేటు కార్లను నడపాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో నిర్వహించనున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం యుద్ధం తరహాలో సన్నద్ధం కావాలని సీఎం అమరీందర్‌సింగ్ పిలుపునిచ్చారు. ‘జరిగిందేదో జరిగిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 900మంది మృతిచెందడం తీవ్రంగా బాధించింది’ అని తెలిపారు. రాబోయే కొద్ది వారాలు కీలకమని, రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉందన్నారు.

నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయాలని, రాజకీయ ఆందోళనలు, సమీకరణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను సీఎం అమరీందర్ సింగ్ ఆదేశించారు. ఈ నెల 1 నుంచి 17 వరకు పంజాబ్‌లో సిరోలాజికల్ సర్వే నిర్వహించారు. అమృసర్, లుథియానా, ఎస్‌ఏఎస్ నగర్, పటియాల, జలంధర్ జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ జిల్లాల పరిధిలోని కంటోన్మెంట్ జోన్లలో 27.7శాతం మంది ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడినట్టు తేలింది.


Next Story

Most Viewed