కూరగాయలు పండిస్తున్న కేరళ పోలీసులు

by  |
కూరగాయలు పండిస్తున్న కేరళ పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ పోలీసులు ఏది చేసినా చాలా వినూత్నంగా ఉంటుంది. వారు ప్రకృతిని గౌరవించే విధానం ఎన్నో ప్రశంసలు అందుకుంది. మొన్నటికి మొన్న చెట్టు పోయిందని ఓ బాలుడు బాధపడితే, తెల్లారేసరికి ఆ బాలుడి ఇంటికి మొక్కలు పట్టుకుని వెళ్లారు. ఇప్పుడు ఏకంగా కూరగాయలే పండిస్తున్నారు. కూరగాయలు అనగానే ఎవరింట్లో వాళ్లు అని అనుకోకండి.. పోలీస్ స్టేషన్‌లో పండించారు. పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడూ మనుషులతో కనీసం తిరగడానికి కూడా జాగా ఉండదని తెలుసు కదా. మరెక్కడ పండించారనే అనుమానం రావొచ్చు. వాళ్లు కూరగాయలు పెంచింది వాహనాల్లో. అదేనండీ.. లైసెన్స్ లేకుండా పట్టుబడ్డ లేదా తప్పుడు ఆధారాలతో ఉన్న వాహనాలను పోలీస్ స్టేషన్‌లో ఉంచుతారు కదా.. ఆ వాహనాల్లో వీళ్లు గార్డెనింగ్ చేస్తున్నారు.

త్రిస్సూర్ జిల్లాలోని చెరుతుర్తి పోలీస్ స్టేషన్‌లో సేంద్రీయ విధానంలో కూరగాయల పెంపకం మొదలుపెట్టారు. వ్యవసాయంలో అనుభవం ఉన్న రంగరాజు అనే సివిల్ పోలీస్ ఆఫీసర్‌ గార్డెనింగ్‌ను ప్రారంభించాడు. ఈయనకు తోడుగా పోలీసులు సింప్సన్, సుధాకరణ్, బేబీ, రంజిత్, రఘు, అనిల్ ఉంటారు. పట్టుకొచ్చిన వాహనాల్లో ఎక్కువగా మినీ ఆటోలు, లారీలు ఉండటం, వీటిలో మట్టి, ఇసుక అక్రమంగా తరలించే వాహనాలు కూడా ఉండటంతో ఆ మట్టిని ఉపయోగించి ఇలా వ్యవసాయం చేస్తున్నట్టు రంగరాజు తెలిపారు. ఈ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిన కూరగాయలను పోలీస్ క్యాంటీన్‌లో ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు బెండకాయ, తోటకూర, చిక్కుడు వంటి కూరగాయలను పండించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా తమ వద్ద నిరుపయోగంగా పడి ఉన్న వాహనాలను ఇలా ఉపయోగపడేలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్క కేరళలోనే అన్ని పోలీస్ స్టేషనలో కలిపి 40 వేలకు పైగా అక్రమంగా పట్టుబడిన వాహనాలు ఉన్నట్లు సమాచారం.


Next Story