ఒక దగ్గర పాజిటివ్.. మరో దగ్గర నెగెటివ్.. ఎందుకిలా?

by  |
ఒక దగ్గర పాజిటివ్.. మరో దగ్గర నెగెటివ్.. ఎందుకిలా?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్నా జనాలు పట్టించుకోకుండా తిరిగేస్తున్నారు. వైద్య అధికారులు మాత్రం గ్యాప్ లేకుండా టెస్టులు చేస్తూనే ఉన్నారు. 10 టెస్టుల్లో కనీసం ఒకటైన పాజిటివ్ వస్తోంది. ఇలా వచ్చి రావడంతోనే ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి మానసికంగా చాలా కుంగిపోతాడు. ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా పాజిటివ్ రావడం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉండి, కరోనా టెస్టులో పాజిటివ్ రావడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఆ టెస్టును నమ్మని సంబంధిత వ్యక్తి మరోసారి వేరే దగ్గర టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ అని రిపోర్ట్ వస్తుంది. మరి ఇక్కడ తప్పిదం ఎవరిది? సాంకేతికంగా కిట్‌లలో లోపమా? లేదా సిబ్బంది నిర్లక్ష్యమా? ఈ విషయాలు తెలియాలంటే ముందు ఆ కరోనా టెస్ట్ కిట్ ఎలా పనిచేస్తుందో తెలియాలి.

కరోనా నిర్ధారణ కోసం ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఇందులో సైకిల్ థ్రెష్‌హోల్డ్ విలువ (సీటీ వాల్యూ) ఆధారంగా కరోనా పాజిటివ్ లేదా నెగెటివ్ అనేది నిర్ధారిస్తారు. తీసుకున్న స్వాబ్ శాంపిల్‌ సీటీ వాల్యూ ద్వారా వైరల్ లోడ్ తెలుసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం సీటీ వాల్యూ 33 కంటే తక్కువగా ఉంటే, కరోనా పాజిటివ్‌గా నిర్ధారిస్తారు. అయితే, కొన్ని సార్లు కొన్ని కిట్‌లలో ఈ వాల్యూ 33 కాకుండా 35 లేదా 36 వరకు సెట్ చేసి ఉండొచ్చు. అందుకే పొరపాటున కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరగొచ్చు. అంతేగాకుండా స్వాబ్ శాంపిల్ తీసుకునే ప్రక్రియ ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. తీసుకున్న స్వాబ్ శాంపిల్ వైరస్ లోడ్ ఎక్కువ ఉంటే కొన్ని సార్లు మొదట పాజిటివ్ వచ్చి, తర్వాత తీసిన స్వాబ్ శాంపిల్‌లో వైరస్ లోడ్ తక్కువగా ఉండి నెగెటివ్ రావొచ్చు. ఇది మాత్రమే కాకుండా మొదటిరోజు టెస్ట్ చేయించినపుడు పాజిటివ్ వచ్చి, రెండో రోజు శరీరంలో ఇమ్యూనిటీ పెరగడం వల్ల మరోసారి టెస్ట్ చేసినపుడు నెగెటివ్ రావొచ్చు. కాబట్టి ఇలాంటి తప్పిదాలు జరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఏదేమైనా ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేయించుకోవడమే మంచిది.


Next Story