పురుగులమందు డబ్బాతో వృద్ధ దంపతుల నిరసన

by  |
పురుగులమందు డబ్బాతో వృద్ధ దంపతుల నిరసన
X

దిశ, వరంగల్: రెవెన్యూ అధికారుల తీరును నిరసనగా వృద్ద దంపతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలతో రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. తమ భూమికి కొత్త పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసి, తమ భూములను కాపాడాలని కోరుతూ, ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. ఒక చేత్తో ఫ్లెక్సీ, మరో చేత్తో పురుగుల మందు డబ్బాలు పట్టుకుని భార్యాభర్తలు కలెక్టరేట్ వరకూ ప్రదర్శనగా రావడం కలకలం రేపింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామ శివారు జెగ్గుతండాకు చెందిన గాదం ఓదమ్మ, కట్టయ్య దంపతులు ప్రస్తుతం వరంగల్ నగరంలోని కొత్తవాడలో నివాసం ఉంటున్నారు. వీరికి పాపయ్యపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 16/1లో 4.12 ఎకరాల భూమి ఉంది. అందులో ఒక ఎకరం భూమిని వేరే వాళ్ల పేరుతో రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం జారీ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న ఆ దంపతులు తమకు న్యాయం చేయాలని అధికారులను ఎంత వేడుకున్నా, ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఆర్డీఓను పలుమార్లు కలిసి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా తహసీల్ధార్ తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఉన్నతస్థాయి అధికారుల వరకు తమ సమస్య చెప్పుకున్నామని, అయినా ఫలితం లేకపోవడంతో ఈ తరహా ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. తమ భూమిని ఇతరుల పేరిట అక్రమంగా పాస్‌బుక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ కబ్జా దారుల నుండి తమను కాపాడాలని, తమ భూమి దక్కే వరకు న్యాయ పోరాటం చేస్తామని ఆ వృద్ధ దంపతులు చెబుతున్నారు. అధికారులు మాకు న్యాయం చేయకుంటే ఆత్యహత్యే శరణ్యమని తెలిపారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి‌కి వినతిపత్రం అందజేశారు. పదిహేను రోజుల్లో విచారణ జరిపి న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.


Next Story