24గంటల్లో 52వేల పాజిటివ్‌లు

by  |
24గంటల్లో 52వేల పాజిటివ్‌లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి వేగం మరింత పెరిగింది. ఒక్కరోజులో నమోదయ్యే కొత్త కేసులు తొలిసారిగా 50వేల మార్కు దాటాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24గంటల్లో 52,123 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఒక్కరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య ఇదే అత్యధికమవడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 15,83,792కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి వివిధ రాష్ట్రాల కేసుల బులెటిన్‌లు వెలువడడంతో మొత్తం కేసుల సంఖ్య 16లక్షలు దాటింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే 700మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 34,968కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి వెలువడ్డ పలు రాష్ట్రాల బులెటిన్‌లలో పేర్కొన్న మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 35వేలు దాటింది. దీంతో కరోనా మరణాల్లో ప్రపంచంలో ఇప్పటిదాకా అయిదవ స్థానంలో ఉన్న ఇటలీని భారత్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలున్న దేశాల జాబితాలో 5వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 10లక్షల మంది కోలుకోగా ప్రస్తుతం 5లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో మాత్రం కేసుల సంఖ్య స్థిరంగా తగ్గుతోంది. 24గంటల్లో కొత్తగా నమోదైన 1,091కేసులతో కలిపి ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,34,403కు చేరింది. కొత్తగా 29కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3,936 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్క రోజులో 11,147 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 4,11,798కి వెళ్లింది. 24గంటల్లో 266 మంది చనిపోగా మొత్తం మరణాలు 14,165కు చేరాయి. తమిళనాడులో 24గంటల్లో 5864 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,39,978కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 97మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3,838కి చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం 60,285 కేసులకు గాను భారీ స్థాయిలో 2418 ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,167 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కు చేరింది. ఒక్కరోజే కరోనాతో 68 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1,281మంది మృత్యువాత పడ్డారు.



Next Story

Most Viewed