సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కు ఊరట

by  |
సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కు ఊరట
X

దిశ, న్యూస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం వెనక ఉద్దేశాలు సరిగాలేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరహా ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. రాజ్యాంగ వ్యవస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలు మంచిది కాదని ప్రధాన న్యాయమూర్తి హితవు పలికారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం తొలగించడతంతో ఆయన రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తక్షణం ఆయనను కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు బాధ్యతలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకొచ్చి ఆయన నియామకానికి అడ్డుకట్టవేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమేనని, దాని అమలుకు స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు ఎదురు దెబ్బలు తగిలిన ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు మరొకటి చేరినట్లయింది. ఈ కేసులో ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.



Next Story