చైనాలో ‘స్వైన్‌ఫ్లూ‌’ను పోలిన మరో వైరస్

by  |
చైనాలో ‘స్వైన్‌ఫ్లూ‌’ను పోలిన మరో వైరస్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచమంతా కరోనా ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఆ మహమ్మారిని నిరోధించడానికి ఓ వైపు శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తుండగా.. మరోవైపు కొవిడ్ వైరస్ ఇప్పట్లో తొలగిపోయేలా లేదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం గమనార్హం. ఇలాంటి భయానక పరిస్థితుల్లో మరో కొత్త వైరస్‌ను గుర్తించినట్లు చైనా పరిశోధకులు తెలిపారు. భవిష్యత్తులో ఇది కూడా కరోనాలాగే పాండమిక్‌గా మారే అవకాశం ఉందని, ఈ వైరస్ తన స్వరూపాన్ని మార్చుకోగలదని, ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుందని తేల్చారు. ఆ వైర‌స్‌ను పందులు క్యారీ చేస్తున్న‌ట్లు వారు అంచ‌నా వేస్తుండగా.. ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ జ‌ర్న‌ల్‌’లో ఈ కొత్త వైర‌స్ గురించి ప్ర‌చురించారు. బ్రిట‌న్‌కు చెందిన ప్రొఫెస‌ర్ కిన్ చౌ చాంగ్, మరికొన్ని యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులతో క‌లిసి ఈ వైర‌స్‌పై స్ట‌డీ చేశారు.

2009లో స్వైన్ ఫ్లూ మహమ్మారి చాలా దేశాలను అతలాకుతలం చేసింది. హెచ్1ఎన్1 వైరస్‌‌కు అడ్వాన్స్‌డ్‌గా వచ్చిందే.. స్వైన్ ఫ్లూ. ఒక రకమైన ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ద్వారా పందులకు ఈ వ్యాధి సోకుతుంది. ఇది మనుషులకూ సంక్రమించడంతో.. చాలా మంది అనారోగ్యానికి గురికాగా, కొద్ది మంది మరణించారు కూడా. అయితే దీనికి వ్యాక్సిన్ వచ్చింది. కాగా ఇప్పుడు మళ్లీ ఈ హెచ్1ఎన్1 వైరస్ జాతి నుంచే.. మరో కొత్త రకం వైరస్ వచ్చిందని పరిశోధకులు గుర్తించారు. ఈ వైర‌స్ మాన‌వుల‌కు కూడా సంక్ర‌మించే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ కొత్త వైర‌స్ వేగంగానే మార్పు చెందుతుందని, క‌రోనా త‌ర‌హాలోనే మ‌నిషి నుంచి మ‌నిషికి సోకుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రించారు. దీనివల్ల త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య లేకున్నా.. కొత్త వైర‌స్ కావ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ స‌మ‌స్యలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు.

కొత్త ఫ్లూ వైర‌స్‌ను G4 EA H1N1గా పిలుస్త‌ున్నారు. 2009లో వ‌చ్చిన స్వైన్ ఫ్లూకు ద‌గ్గ‌ర‌గానే ఈ ఫ్లూ ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే పందులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే వారిలో ఈ కొత్త వైరస్ ఇప్పటికే సోకి ఉంటుందని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికైతే.. పందుల నుంచి మనుషులకు సోకింది. మరి మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా? అన్న అంశం ఇంకా నిర్ధారణ కాలేదు. మరిన్ని పరిశోధనలు చేస్తే కానీ ఈ విషయం వెల్లడి కాదని శాస్త్రవేత్తలన్నారు. వైర‌స్‌ను అడ్డుకోవాలంటే.. పందుల‌ను నియంత్రించాల‌ని శాస్త్ర‌వేత్త‌లు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి ఈ వైరస్‌తో ముప్పు లేదని, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇది మనుషుల రెస్పిరేటరీని నాశనం చేస్తుందని, శ్వాస వ్యవస్థ నుంచి లంగ్స్‌లోకి ప్రవేశిస్తుందని తెలిపారు.


Next Story

Most Viewed