కరోనా తెచ్చిన మార్పు.. బాగుందంట!

by  |
కరోనా తెచ్చిన మార్పు.. బాగుందంట!
X

దిశ, షాద్ నగర్: కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గిపోతుందిలే అనుకుంటే అంతకంతా పెరిగిపోతున్నది. ఇక అసలే వర్షాకాలం. అంటువ్యాధులు ప్రబలే రోజులు. కరోనా కు మందు కూడా రాకపోవడంతో ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకోవడంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. అలాగే లైఫ్ స్టైల్ లోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు. మాస్కులేనిదే బయటికి రావడం లేదు. శానిటైజర్ ని దగ్గరే ఉంచుకుంటున్నారు. చేతులు శుభ్రం చేసుకుంటూ సుచి,శుభ్రతను పాటిస్తూ కరోనాను దగ్గరకు రానీయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇమ్యూనిటీని పెంచుకునేందుకు తిప్పలు..

కరోనా వచ్చినా ఆరోగ్యంగా ఉండేలా జనం తమ ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. పొద్దున లేచి వాకింగ్, యోగా చేస్తున్నారు. ఉదయాన్నే నిమ్మకాయ కలిపిన వేడినీళ్లు తాగుతున్నారు. ఎన్నడూ వాసన కూడా చూడని కషాయాన్ని ముక్కు మూసుకుని మింగుతున్నారు.

ఇంట్లోనే..

మిరియాలు, జీలకర్ర, వామ, శొంఠి, లవంగాలతో కూడిన కషాయాలను తయారు చేసి కుటుంబం మొత్తం తాగుతున్నారు. ఫ్రీజ్ నీరు బంద్​ చేసి ప్రతిరోజు వేడినీళ్లే తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీని పెంచే ఆకుకూరలు, పండ్లతో పాటు చేపలు, మటన్ తినడానికి ఇష్టపడుతున్నారు. కరోనాకు చెక్ పెట్టేలా కషాయం ఛాయ్, గ్రీన్ టీ, రాగి జావ తీసుకుంటున్నారు.

మాయదారి రోగంఆగం చేస్తుంది: అల్లం రాంకోటి రెడ్డి.కాకూనూర్ గ్రామం

నాకు 90 ఏళ్లు ఉంటాయి. కానీ ఇలాంటి రోగం ఎప్పుడు చూడలేదు. అందరినీ ఆగం ఆగం చేస్తుంది. ఎట్లా వస్తుందో తెలుస్తలేదు. పిల్లలు కూడా ఇంటి నుంచే ఉద్యోగం అంటున్నారు. నేను తరచుగా జొన్న రొట్టెలు, జావ బెల్లం, నువ్వులు, పల్లీలు తినేవాడిని. దాని జోలికెళ్ళని మా పిల్లలు కూడా రోగం భయానికి ఇప్పుడు ఇవి తినడమే కాకుండా కషాయలు తాగుతుండ్రు. ఈ రోగం ఎప్పుడు తగ్గుతదో, మందు తొందరగా వస్తే బాగుండు.

కరోనాతో లైఫ్ స్టైలే మారుతుంది: అనుమగళ్ల రమేష్, పోమాల్ పల్లి గ్రామం

కరోనాతో జీవన విధానం మారిపోయింది. మాస్కు లేనిదే బయటికి వెళ్లలేకపోతున్నాం. బయట సామాజిక దూరం పాటిస్తున్నాం. శక్తి పెంచుకోవడానికి ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటున్నాం. గతంలో ఫ్రీజ్ నీళ్లే తాగేవాళ్లం. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లే తాగుతున్నాం. నిత్యం యోగ చేస్తున్న, వాకింగ్ వెళుతున్నా. బయటతినడం మానేసాం. ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటున్నాం.



Next Story