భారత భూభాగాన్ని కలుపుకున్న మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఓటు!

by  |
భారత భూభాగాన్ని కలుపుకున్న మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఓటు!
X

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన కొంత భూభాగాన్ని తమదిగా చూపిస్తున్న నేపాల్ రాజకీయ చిత్రపటాన్ని ఆమోదించేందుకు ఆ దేశ పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తున్నది. దీనికోసం రాజ్యాంగ సవరణ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ మ్యాప్‌పై చర్చలు జరిపి అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు ఆ దేశ పార్లమెంట్ ప్రతినిధి రోజ్‌నాథ్ పాండే శనివారం తెలిపారు. దీనికోసం చట్టసభ్యులు పార్లమెంట్‌కు వచ్చారని వివరించారు. గతనెలలో నేపాల్ ఈ మ్యాప్‌ను బహిరంగపరిచిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. చారిత్రక వాస్తవాలను పక్కనపెట్టి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమంటూ ఆగ్రహించింది.

తాజాగా, ఆ పటాన్నే ఆమోదించేందుకు నేపాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంట్‌లో సమావేశాలను ఏర్పాటు చేసింది. వాయువ్య నేపాల్‌లోని కాలి నది సమీపంలోని భారత భూభాగాన్ని ఈ కొత్త పటంలో నేపాల్ తమదిగా పేర్కొంటున్నది. ఉత్తరాఖండ్‌కు చెందిన లిపులేఖ్ పాస్, లింపియదురా, కలాపనిలాంటి ప్రాంతాలు ఈ పటంలో నేపాల్‌కు చెందినవిగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాలు 1962 చైనాతో యుద్ధంలో భారత్‌కు వ్యూహాత్మకంగా ఉపయోగపడ్డవి కావడం గమనార్హం.

కాగా, ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌వేనని ఢిల్లీ ఇటీవలే ఓ మ్యాప్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. నేపాల్ చర్యలపై భారత్ అసంతృప్తి వ్యక్తంచేసింది. అటువంటి ఆక్రమణలను అంగీకరించేది లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఈ నిర్ణయాలను నేపాల్ ప్రభుత్వం మానుకోవాలని, భారత సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని చెప్పారు. కాగా, నేపాల్‌తో మనదేశానికి పటిష్టమైన సంబంధాలున్నాయని, భవిష్యత్‌లోనూ అలాగే కొనసాగుతాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె వ్యాఖ్యానించడం గమనార్హం.


Next Story

Most Viewed