Swaminathan :‘స్వామినాథన్’ సిఫార్సులను యూపీఏ సర్కారే తిరస్కరించింది : శివరాజ్‌ సింగ్ చౌహాన్

by Hajipasha |
Swaminathan :‘స్వామినాథన్’ సిఫార్సులను యూపీఏ సర్కారే తిరస్కరించింది : శివరాజ్‌ సింగ్ చౌహాన్
X

దిశ, నేషనల్ బ్యూరో : పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈసందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పంట సాగు ఖర్చులపై 50 శాతం రాబడిని అందించేలా ఎంఎస్పీ ఉండాలనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సును తిరస్కరించిన చరిత్ర మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ప్రకటనతో 2007 సంవత్సరం జులై 28న యూపీఏ ప్రభుత్వం విడుదల చేసిన క్యాబినెట్ నోట్‌ను ఈసందర్భంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజ్యసభలో చదివి వినిపించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేస్తే.. యావత్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ సుస్థిరతకు భంగం కలుగుతుందని అప్పట్లో యూపీఏ సర్కారు అభిప్రాయపడిందని ఆయన గుర్తుచేశారు.

‘‘పంటలకు ఎంఎస్‌పీ కల్పించే అంశంపై ప్రస్తుత పార్లమెంటు సెషన్‌లో చట్టం చేసే ఆలోచన ఉందా ?’’ అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌జీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘వ్యవసాయ ఉత్పత్తులకు ఎంఎస్‌పీ అంశంపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. దాని సిఫార్సులు వచ్చిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఆయన తెలిపారు. ‘‘కమిటీ నివేదిక కోసం ఇంకా ఎంతకాలం వేచి చూస్తారు ? లీగల్ గ్యారెంటీ ఇస్తారా ? లేదా ? ’’ అని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రశ్నించారు. దీనికి శివరాజ్‌సింగ్ చౌహాన్ బదులిస్తూ.. ‘‘రైతులు మాకు దేవుళ్లలాంటి వారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు లక్ష్యం. ఇందుకు అందుబాటులో ఉండే ఏ మార్గాన్ని కూడా మేం వదలం’’ అని స్పష్టం చేశారు.



Next Story