NHAI: దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు 4 నుంచి 5 శాతం పెంచాం: ఎన్‌హెచ్ఏఐ

by S Gopi |
NHAI: దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు 4 నుంచి 5 శాతం పెంచాం: ఎన్‌హెచ్ఏఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల టోల్ ఛార్జీలపై సగటున 4 నుంచి 5 శాతం వరకు పెంచింది. దేశవ్యాప్తంగా సవరించిన టోల్ ఛార్జీలు మంగళవారం(ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయని హైవే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ పెంపు నిర్ణయం టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఆధారంగా తీసుకున్నదని, ప్రతి ఏటా సమీక్షలో భాగంగా పెంపు ప్రక్రియను చేపడుతున్నట్టు ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది. ఎన్‌హెచ్ఏఐ అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలకు వేర్వేరుగా టోల్ రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం, జాతీయ రహదారులపై దాదాపు 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ ప్లాజాల వద్ద జాతీయ రహదారుల రుసుము (రేట్లు మరియు సేకరణ) నియమాలు, 2008 ప్రకారం ఛార్జీలను వసూలు చేస్తున్నారు. వీటిలో దాదాపు 675 పబ్లిక్-ఫండ్ నిర్వహిస్తున్నవి కాగా, 180 రాయితీతో నడిచే టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో, సరాయ్ కాలే ఖా నుంచి మీరట్‌కు ప్రయాణించే కార్లు, జీపులకు వన్-వే టోల్ రూ. 165 నుంచి రూ. 170కి, అదే సమయంలో ఘజియాబాద్ నుంచి మీరట్‌కు టోల్ ఛార్జీ రూ. 70 నుంచి రూ. 75కి పెరుగుతుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై, ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద, ప్రైవేట్ కార్లు, జీపులకు టోల్‌లు యథాతథంగా ఉంటాయి. కానీ పెద్ద వాహనాలకు ఒక్కో ట్రిప్పుకు రూ. 5 చొప్పున పెరుగుతాయి. కార్ల నెలవారీ పాస్ రూ. 930 నుంచి రూ. 950కి, కమర్షియల్ కార్లు, జీప్‌లకు ఇది రూ. 1,225 నుంచి రూ. 1,255కి, తేలికపాటి మోటారు వాహనాలు, మినీబస్సుల కోసం సింగిల్ ట్రిప్ టోల్‌లు రూ. 120 నుంచి రూ. 125కి పెరుగుతాయి. మిగిలిన హైవే, ఎక్స్‌ప్రెస్‌వేలలో కూడా ఇదే తరహాలో పెంపు ఉండనుంది.



Next Story

Most Viewed