సిసోడియాకు దక్కని ఊరట: బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

by Dishanational2 |
సిసోడియాకు దక్కని ఊరట: బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శనివారం తీర్పు వెల్లడించాల్సి ఉండగా..రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 30న వెల్లడించనున్నట్టు తెలిపింది. అంతకుముందు సిసోడియాకు బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన బెయిల్‌ను గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశాయి. అయితే సిసోడియాకు ఎన్నికల ప్రచారం నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. సీబీఐ, ఈడీ, సిసోడియా తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండ రింగ్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ వాటిని కోర్టులు తిరస్కరించాయి. దీంతో తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed