అరెస్ట్ తర్వాత ఆప్ మరింత ఐక్యమైంది.. ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు: కేజ్రీవాల్

by Disha Web Desk 17 |
అరెస్ట్ తర్వాత ఆప్ మరింత ఐక్యమైంది.. ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు: కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: నన్ను అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పటికీ కూడా పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి కట్టుగా ఉన్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నా అరెస్ట్ తర్వాత, ఆప్ మరింత ఐక్యమైంది. ప్రజలకు మందులు అందడంలో ఇబ్బందులు రాకూడదని, ఉచిత కరెంటు, నీళ్లు ఆపకూడదని నేను ఆందోళన చెందాను. అయితే మీరందరూ చాలా బాగా పనిచేశారు, బీజేపీ చేసిన ఏ కుట్రను సఫలం కానివ్వలేదని కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నన్ను అరెస్టు చేసి, పార్టీని విచ్ఛిన్నం చేయాలని, ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని, ఆపై పంజాబ్‌లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. అరెస్టు చేసిన తర్వాత, వారి ప్లాన్ విఫలమైంది, మీరందరూ పార్టీని విచ్ఛిన్నం చేయనివ్వలేదు, నా అరెస్ట్ తర్వాత పార్టీ మరింత బలపడిందని ఆప్ ఎమ్మెల్యేలతో ఆయన అన్నారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్న కేజ్రీవాల్ శుక్రవారం సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్‌‌పై విడుదలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయబడింది. ఈ సందర్భంగా నిర్వహించిన మొదటి ర్యాలీలోనే ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఆదివారం తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రశంసిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు.

Next Story