UP Speaker: ఎమ్మెల్యే పాన్ మసాలా ఉమ్మివేసింది చూసా- స్పీకర్

by Shamantha N |
UP Speaker: ఎమ్మెల్యే పాన్ మసాలా ఉమ్మివేసింది చూసా- స్పీకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పాన్ మసాలా చిచ్చురేపింది. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పాన్ మసాలా తిని అక్కడే ఉమ్మివేశారని స్పీకర్‌ సతీష్‌ మహానా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. సభా ప్రాంగణంను శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరిన ఆయన.. తాను శుభ్రం చేయడానికి గల కారణం చెప్పడంతో ఎమ్మెల్యేలంతా తలలు దించుకున్నారు. సెషన్‌ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ సతీష్‌ మహానా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ ఉదయం విధాన సభ హాల్‌లో జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకరు పాన్ మసాలా నమిలి ఉమ్మేశారు. విషయం తెలియగానే‌ నేనే స్వయంగా వెళ్లి అక్కడ శుభ్రం చేశా. ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూశా. కానీ, పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవడం లేదు. తనంతట తానుగా ఆయన నా దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చుకుంటే మంచిది. లేకుంటే నేనే ఫోన్ చేసి పిలవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ అందరికీ ఓ విజ్ఞప్తి. ఇక మీదట అలా ఎవరైనా చేస్తుండడం మీరు గమనిస్తే.. వాళ్లను అడ్డుకోండి. ఎందుకంటే.. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత” అని చెప్పారు. విధానసభను సిబ్బందితో కలిసి తానే స్వయంగా శుభ్రంచేశానని వెల్లడించారు.

గతేడాది కంటే 9.8 శాతంగా బడ్జెట్

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ఫిబ్రవరి 20న అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి రూ. 8,08,736 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ 2024-25 బడ్జెట్ కంటే 9.8 శాతం ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పకొచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఈసారి దృష్టి సారించినట్లు వెల్లడించారు. గతంలో యూపీ ఆర్థిక వ్యవస్థ ఏడో స్థానంలో ఉండగా.. భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందని హైలెట్ చేశారు. మొత్తం బడ్జెట్ లో 11 శాతం వ్యవసాయం కోసమే కేటాయించామన్నారు. మొత్తం బడ్జెట్ లో 6 శాతం ఆరోగ్యసంరక్షణ కోసం కేటాయించినట్లు వెల్లడించారు.



Next Story

Most Viewed