Myanmar: మయన్మార్ భూవిలయం.. భయానక దృశ్యాలు ఇవే

by Shamantha N |
Myanmar: మయన్మార్ భూవిలయం.. భయానక దృశ్యాలు ఇవే
X

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్‌లో భూకంపం(Myanmar Earthquake) విలయం సృష్టించింది. నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు రావడంతో దాదాపు 2 వేల మంది చనిపోయారు. ప్రకంపనల ధాటికి వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమవ్వగా.. శిథిలాల కింద చిక్కుకుని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ భయానక దృశ్యాలను (ISRO Satellite Images) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాటిలైట్‌ విజువల్స్ ని రిలీజ్ చేసింది. ప్రకృతి విపత్తుకు ముందు, తర్వాత మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలను ఇస్రో (ISRO)కు చెందిన ఎర్త్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ కార్టోశాట్‌-3 ఫొటోలు తీసింది. భూ ఉపరితలానికి 500 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన ఈ చిత్రాల్లో భూకంపం కారణంగా ఎంతటి నష్టం వాటిల్లిందో స్పష్టమవుతోంది. ఇరావడీ నదిపై ఉన్న వంతెన కూలిపోవడం, మాండలే యూనివర్సిటీ, ఆనంద పగోడా నేలమట్టమైన దృశ్యాలను ఇస్రో ఫొటోలు తీసింది. మరోవైపు, 2019లో ప్రయోగించిన కార్టోసాట్-3 మూడవ తరం చురుకైన అధునాతన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. ఈ అత్యంత అధునాతన ఉపగ్రహం నుండి ఇస్రో అరుదుగా చిత్రాలను విడుదల చేస్తుంది.

పెరుగుతున్న మృతుల సంఖ్య

మయన్మార్ లో భూకంపం(Earthquake) ధాటికి నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భూవిలయంలో మృతుల సంఖ్య 2,056కి పెరగగా.. 3900 మందికి పైగా గాయపడినట్లు మయన్మార్‌ సైనిక ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా 270 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఒకవైపు మృతదేహాలు.. మరోవైపు క్షతగాత్రులతో అక్కడి ఆస్పత్రులు నిండిపోయాయి. భూకంపం వచ్చి మూడు రోజులు గడుస్తున్న నేపథ్యంలో శిథిలాల కింద చిక్కుకున్నవారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు, మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు సైతం మయన్మార్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.



Next Story