కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు ఎంత ఖర్చవుతుందో చెప్పగలరా?: నిర్మలా సీతారామన్ సవాల్

by S Gopi |
కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు ఎంత ఖర్చవుతుందో చెప్పగలరా?: నిర్మలా సీతారామన్ సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హీట్ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రస్తావించిన ఆమె, రాహుల్ గాంధీకి పలు కీలక అంశాలపై సవాల్ విసిరారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల ఆర్థిక వ్యయాన్ని తీర్చే ప్రణాళికలను రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆర్థిక మంత్రి, ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థిక నిర్వహణ గురించి ప్రతిపక్షాలు పెరిగిన జీడీపీని పరిగణలోకి తీసుకోకుండా వాదిస్తున్నాయి. నేను పారదర్శకంగా లేని, వాస్తవానికి దూరంగా కాంగ్రెస్ వాగ్దానాల వెనుక ఉన్న వివరాలను బయటపెట్టాలనుకుంటున్నారు. 'కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చేసిన ఘనమైన వాగ్దానాల ఖర్చును పరిగణలోకి తీసుకున్నారా? ఖటా ఖట్ పథకాలకు ఆర్థికంగా ఎంత ఖర్చవుతుందో వారు లెక్కించారా? వాటి కోసం భారీ అప్పులు తీసుకుంటారా లేదా నిధుల కోసం పన్ను పెంచుతారా? అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

భారత ప్రజల కోసం రాహుల్ గాంధీ ఈ ప్రశనలకు సమాధానం చెప్పాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. నిజానికి మేము కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్నప్పటికీ ఆర్థిక నిర్వహణ యూపీఏ హయాంలో కంటే మెరుగ్గా ఉంది. యూపీ, ఎన్డీఏ పాలనను పోల్చిన ఆర్థిక మంత్రి.. కేంద్ర ప్రభుత్వ అప్పులు, ప్రస్తుత విలువ ప్రకారం, 2004, మార్చిలో బహిరంగ రుణాలు రూ. 18.74 లక్షల కోట్ల నుంచి 3.2 రెట్లు పెరిగి 2014, మార్చి నాటికి రూ. 58.59 లక్షల కోట్లకు పెరిగాయి. తమ హయాంలో 2014లో రూ. 58.59 లక్షల కోట్ల నుంచి 2024, మార్చి నాటికి రూ. 172.37 లక్షల కోట్లకు చేరింది. ఇది 2.9 రెట్లు వృద్ధి అనేది యూపీఏ కంటే మెరుగ్గా ఉందని వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 52.2 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణ భారం, 2018-19లో 48.9 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ఆర్థిక లోటు 4.5 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గించాం. అయితే, కరోనా మహమ్మారి కారణంగా 2019 తర్వాత నుంచి ఆర్థిక లోటు 9.2 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వ రుణాన్ని జీడీపీలో 61.4 శాతానికి పెంచిందని వివరించారు. కానీ 2021 నుంచి 2024, మార్చి నాటికి రుణ-జీడీపీ నిష్పత్తిని 61.4 శాతం నుంచి 57.1 శాతానికి తగ్గించామని చెప్పారు.

కరోనా సమయంలో ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు 'రుణాలు తీసుకోండి, ఖర్చు చేయండి, నగదును ఎక్కువ ముద్రించండి ' అని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలే చెప్పాయి. కానీ ఇప్పుడు హాస్యాస్పదంగా వారే అప్పులు పెరిగాయని మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి ఎద్దేవా చేశారు. 2022లో భారత రుణ-జీడీపీ నిష్పత్తి 81 శాతంగా ఉంది. ఇది జపాన్(260.1 శాతం), ఇటలీ(140.5 శాతం), యూఎస్ఏ(121.3 శాతం), ఫ్రాన్స్(111.8 శాతం), యూకే(101.9 శాతం) కంటే చాలా తక్కువ అని ఆమె పేర్కొన్నారు.



Next Story