Pahalgam: భద్రతా బలగాల కోసం ఉగ్రవాదుల ట్రాప్

by Shamantha N |
Pahalgam: భద్రతా బలగాల కోసం ఉగ్రవాదుల ట్రాప్
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గాం ఉగ్రదాడి నిందితులు అసిఫ్ ఫౌజీ, ఆదిల్ థోకర్ భద్రతా బలగాల కోసం ట్రాప్ పన్నారు. వారి ఇళ్లలో సోదాల కోసం అధికారులు కచ్చితంగా వస్తారని అంచనా వేసిన ముష్కరులు.. వారిని చంపేలా పేలుడు పదార్థాలను అరేంజ్ చేశారు. కాగా.. ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది త్రుటిలో తప్పించుకోగలిగారు. దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్‌ (Asif Sheikh), ఆదిల్ థోకర్‌ అలియాస్‌ ఆదిల్‌ గురి అనే ఇద్దరు పెహల్గాం ఉగ్రదాడికి కారణకులుగా భావిస్తున్నారు. అయితే, ఉగ్రవాదుల ఇళ్లల్లో సోదాలు జరపడానికి జమ్మూకశ్మీర్‌ పోలీసులు వెళ్లారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్‌ అయినట్లు గుర్తించారు. దీంతో వారు వెంటనే బయటకు రాగా.. కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకే, వారి ఇళ్ల గురించి భద్రతా బలగాలకు సమాచారం అందేలా చేసినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.

ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట

మరోవైపు, పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఆసిఫ్‌ ఫౌజి, సులేమాన్‌ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్‌, ఆసీఫ్‌ అనే కోడ్‌నేమ్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, ఆ ముగ్గురికి ఆదిల్ థోకర్‌ అనే మరో ఉగ్రవాదికి కూడా వీరితో సంబంధం ఉందని తెలిపింది. ఆదిల్ 2018లో చట్టబద్ధంగా పాకిస్థాన్‌ వెళ్లి, గతేడాది జమ్మూకశ్మీర్‌కు తిరిగి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాడని అధికారులు వెల్లడించారు. వీరందరూ జమ్ముకశ్మీర్‌ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’లో సభ్యులు. కాగా.. వీరి కోసం భద్రతా సిబ్బంది వేట మొదలుపెట్టారు. వారి ఆచూకీ గుర్తించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని అనంతనాగ్ పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed