FLASH.. FLASH: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు, 14 మంది దుర్మరణం

by Shiva |   ( Updated:2024-08-23 07:36:30.0  )
FLASH.. FLASH: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు, 14 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు తనహున్ జిల్లాలో పోఖారా నుంచి ఖాట్మాండ్‌కు వెళ్తుండగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఎఫ్‌టీ 7623 నంబర్‌ గల బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మర్సాంగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 69 మంది ప్రయాణికులు ఉండగా అందులో 40 మంది భారత్‌‌కు చెందిన వారు ఉన్నారని సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నేపాల్ పోలీసులు రెస్య్కూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ నేపాల్ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎవరైనా బస్సులో ఉన్నారో లేదో తెలుసుకునేందుకు అక్కడి వారితో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఇదే ఏడాది జూలైలో నేపాల్‌లోని త్రిశూలి నదిలో రెండు బస్సులు పడిపోయి 65 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వర్షాలు నేపథ్యంలో ఆ రెండు దుర్ఘటనలు జరిగిన విషయం మనందరికీ విదితమే.

Advertisement

Next Story

Most Viewed