Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మొదటి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

by S Gopi |
Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మొదటి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తన తొలి జాబితాను విడుదల చేసింది. భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కాంగ్రెస్‌లో చేరిన రోజే కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. వినేష్ ఫొగట్ రాష్ట్రంలోని జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మొత్తం 90 స్థానాలకు గానూ 31 సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. వినేష్ ఫొగట్‌తో పాటు టోక్యో ఒలంపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాలను శుక్రవారం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో గర్హి సంప్లా-కిలోలి స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా పోటీ చేయనున్నారు. అలాగే కర్నాల్ మాజీ మేయర్, సదౌరా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేణుబాలా పోటీలో ఉన్నారు. బద్లీ నుంచి కుల్దీప్ వ్త్స్, రాదౌర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే బిషన్ లాల్ సైనీ, కల్కా నుంచి ప్రదీప్ చౌదరి, నారైన్‌గఢ్ నుంచి షల్లీ చౌదరి పోటీ చేయనున్నారు. మొత్తంగా 31 స్థానాల్లో 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. వారిలో దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నుంచి కాంగ్రెస్‌లోకి మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ కరణ్‌కు కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. లాడ్వా స్థానానికి ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి నయాబ్ సింగ్ సైనీపై మేవా సింగ్‌ను పోటీకి దింపింది. కాగా, హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed