జైలు నుంచి కేజ్రీవాల్ వరుస ఆదేశాలపై.. హైకోర్టు ఏం చెప్పిందంటే ?

by Hajipasha |
జైలు నుంచి కేజ్రీవాల్ వరుస ఆదేశాలపై.. హైకోర్టు ఏం చెప్పిందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో నుంచి ప్రభుత్వ సంబంధిత ఆదేశాలను జారీ చేయడాన్ని ఆపాలంటూ సూర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాడు. దీన్ని సోమవారం విచారించిన న్యాయస్థానం కేజ్రీవాల్ కేసును విచారిస్తున్న దిగువ కోర్టు దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లాలని ఈడీకి సూచించింది. ‘‘కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీలో కంప్యూటర్, ప్రింటర్, ఇతర పరికరాలకు అందిస్తున్నారు’’ అంటూ పిటిషనర్ చేసిన ఆరోపణను ఈడీ తరఫు న్యాయవాది ఖండించారు. అలాంటి వసతులేవీ తాము కేజ్రీవాల్‌కు కల్పించడం లేదని కోర్టుకు తెలిపారు.

కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే..

ఇక ఈ పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రాహుల్‌ మెహ్రా తప్పుపట్టారు. హైకోర్టు‌లో ఇలాంటి పిటిషన్లు వేసే వారు కనీస ఆధారాలనైనా చూపించే స్థితిలో ఉండాలని పేర్కొన్నారు. ఒక కేసులో దర్యాప్తు జరుగుతుండగా.. ఎలాంటి ఆధారాలు లేని థర్డ్ పార్టీ (పిల్ వేసిన పిటిషనర్) జోక్యానికి అనుమతించడం సరికాదని హైకోర్టును ఆయన కోరారు. అయితే సూర్జిత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన దాన్ని ఒక పిటిషన్‌గా కాకుండా.. ఓ రిప్రజెంటేషన్‌లా పరిగణించాలని ఈడీకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. జైలులో ఉన్న వ్యక్తి సీఎం పోస్టులో కొనసాగేందుకు అర్హుడు కాదంటూ ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేసింది కూడా సూర్జిత్ సింగ్ యాదవే. ఆ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం అప్పట్లో కొట్టేసింది.

Advertisement

Next Story

Most Viewed