నగ్మా, కంగన‘ట్వీట్’కున్నారు

by  |
నగ్మా, కంగన‘ట్వీట్’కున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్ :
సినీపరిశ్రమలో బంధుప్రీతిపై చాలాకాలంగా బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ పోరాటం చేస్తున్నారు. యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి అనంతరం బంధుప్రీతిపై కంగన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ చాలామంది నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల నటి, రాజకీయ నాయకురాలు నగ్మా కంగనను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ”కంగన కెరీర్‌ మొత్తం బంధుప్రీతిపైనే నిలబడింది. తన బాయ్‌ఫ్రెండ్‌ ఆదిత్య పంచోలీ ద్వారా ఆమె బాలీవుడ్‌కు పరిచయమైంది(బంధుప్రీతి). తొలి సినిమా గ్యాంగ్‌స్టర్‌కు మహేశ్‌ భట్ నిర్మాత(బంధుప్రీతి). తొలిసినిమాలో ఇమ్రాన్‌ హష్మితో కలిసి నటించింది(బంధుప్రీతి). హృతిక్‌ రోషన్‌ కైట్స్‌, క్రిష్‌-3 సినిమాలతో ఆమె కెరీర్‌ నిలబడింది(బంధుప్రీతి). తన సోదరినే మేనేజర్‌గా నియమించుకుంది(బంధుప్రీతి). సుశాంత్‌సింగ్‌ మృతికి ముందు అతడికి సాయం చేయలేదు.. కానీ చనిపోయిన తర్వాత సుశాంత్‌ కోసం పోరాడుతోంది”అని రాసున్న ఓ ఫొటోను నగ్మా ట్వీట్‌ చేసింది. దీనిపై కంగన టీం స్పందించింది. నగ్మా పెట్టిన ట్వీట్‌కు ట్విట్టర్‌లోనే సవివరంగా సమాధానం చెప్పింది.

”నగ్మా గారు, 1) పంచోలీ కంగన బాయ్‌ఫ్రెండ్‌ కాదు. ఇది వరకే ఆమె చాలాసార్లు ఈ విషయం చెప్పింది. పంచోలీ కంగనకు ఒక గురువుగా ఉంటానని ప్రమాణం చేశాడు. కానీ ఆ తర్వాత అతడు మారిపోయాడు. కంగన ఆడిషన్స్‌, షూటింగ్స్‌కు వెళ్లివచ్చిన ప్రతిసారి అతడు ఆమెను కొట్టేవాడు. అనురాగ్‌ బసుకు ఆమెను పరిచయం చేసింది పంచోలీ కాదు. బసుకి పంచోలీ ఎవరో కూడా తెలియదు. 2) గ్యాంగ్‌స్టర్‌ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఎంపికైంది. అందులో బంధుప్రీతి లేదు. కైట్స్‌ చిత్రంలో కంగన చిన్న పాత్ర చేసింది. దాని వల్ల ఆమె కెరీర్‌ పాడైంది. క్రిష్‌లో ఆమె నటించాలని అనుకోలేదు.. కానీ బలవంతం మీద చేయాల్సి వచ్చింది. ఏ ఏజెన్సీ కంగనను నియమించుకోదు. ఎందుకంటే ఆమె వివాహ వేడుకల్లో డాన్సులు చేయదు. ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల యాడ్స్‌లో నటించదు. కాబట్టి కంగన డేట్స్‌ను రంగోలీ చూసుకుంటోంది”అని కంగన టీం ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్స్‌ విషయంలో నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు కంగనకు మద్దతు పలుకుతుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.


Next Story

Most Viewed