మారటోరియం పొడిగించాలి: ఎంఎస్ఎంఈలు

by  |
మారటోరియం పొడిగించాలి: ఎంఎస్ఎంఈలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈ) రుణాలపై మారటోరియం మరో 3 నెలలు పొడిగించడం, ఒత్తిడితో కూడిన ఖాతాల పునర్నిర్మాణం, వడ్డీ రేట్ల తగ్గింపు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు చంద్రకాంత్ ఈ అంశంపై మాట్లాడుతూ..జూన్ జీఎస్‌టీ వసూళ్లు ఈ రంగంలోని రికవరీకి ప్రతిబింబించవని, ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో చేసిన బిల్లింగ్‌లకు ఎక్కువ సంస్థలు పన్నులు చెల్లించాయని ఆయన వివరించారు.

జూన్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 90,917 కోట్లు కాగా, చాలామంది నిపుణులు దీన్ని ఆర్థిక పునరుద్ధరణకు చిహ్నంగా భావించారు. ‘మారటోరియం పొడిగించాలని ఆర్‌బీఐని అభ్యర్థించాం. ఏప్రిల్-జూన్ కాలంలో వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా కుదించుకుపోయాయి. జూన్ నెల జీఎస్టీ వసూళ్లు క్షేత్ర స్థాయి వాస్తవాలను ప్రతిబింబించవు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగానికి అన్ని రకాల ప్రయోజనాలను విస్తరించాలి. రుణాలపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగించాలి. అదనంగా, వడ్డీ రేట్లను తగ్గించాలని’ చంద్రకాంత్ తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 14.7 శాతానికి పెరుగుతాయని ఆర్‌బీఐ అంచనా వేస్తుండగా, 2020 డిసెంబర్ నాటికి చెడు అప్పులు 35 శాతానికి పెరుగుతాయని ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది.


Next Story