ఇందుకోసం ఎక్కువ మంది ఇంట్రెస్ట్

by  |
ఇందుకోసం ఎక్కువ మంది ఇంట్రెస్ట్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : వర్షాలు కురవడం మొదలుకావడంతో రైతులు వ్యవసాయపనుల్లో నిమగ్నమయ్యారు. ఏరువాక పౌర్ణమితో ఇప్పటికే పలు చోట్ల దుక్కులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 18.61 లక్షల ఎకరాల్లో పంట సాగు కానుందని అంచనా. ఇందులో ఎక్కువ శాతం పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. భారీ వర్షాల కోసం వరి రైతులు ఎదురుచూస్తున్నారు. సాగు ఆలస్యమైతే దిగుబడి తగ్గే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.

జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ఏరువాక పౌర్ణమితో చాలా చోట్ల ఇప్పటికే దుక్కుల పనులు ప్రారంభించారు రైతులు. ఇప్పటికే అవసరమైన విత్తనాలు కొనుగోలు చేశారు. 50 శాతానికి పైగా రైతులు విత్తనాలను విత్తుకున్నారు. యూరియా, ఎరువులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18.61 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టు అంచనా. గతేడాది పంటల సాగు ఆశించిన స్థాయిలో ఉన్నా.. పండిన పంటలకు మద్ధతు ధర లేక రైతులు నిరాశ చెందారు. ‘చెప్పిన పంటల్నే సాగు చేయాలి’ అని సర్కారు చెప్పడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఆడపాదడపా కురిసిన వర్షాలకే రైతులు కార్తె వెళ్లిపోతోందంటూ ఇప్పటికే సగానికి పైగా విత్తనాలు విత్తుకున్నారు. పంటల సాగు ఆలస్యమైతే దిగుమతి తగ్గే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

చిన్న పాటి వర్షాలకే విత్తులు

అధిక శాతం మంది రైతులు మృగశిర కార్తెలోనే విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతారు. కొందరు మృగశిర కార్తె దాటినా విత్తనాలు పెడుతుంటారు. కార్తె బలం మీద విత్తే విత్తనాలకు దిగుబడి సైతం ఎక్కువగానే వస్తుందని రైతుల అభిప్రాయం. అందుకే చిన్నపాటి వర్షానికే అధిక శాతం మంది రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఇదే సమయంలో వరినారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. కానీ మడులను దున్నుకునేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో ఆ పనులు ఇంకా ఊపందుకోలేదు.

పత్తి వైపే ఆసక్తి

జిల్లాలో ఈ సారి పత్తిపంట ఎక్కువగా సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మిరప పంటతో నష్టపోయిన రైతాంగం పత్తి సాగుకు మొగ్గుచూపిస్తున్నట్టు సమాచారం. మిర్చికి మార్కెట్‌లో ధర లేకపోవడంతో పాటు అధికశాతం మంది రైతులు కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచారు. జిల్లాలో చింతలపాలెం, మేళ్లచెర్వు, మోతె, చివ్వెంల, నూతనకల్, పెన్‌పహాడ్‌లోని రైతులు మిర్చి సాగు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10.51 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనుండగా, అందులో ఇప్పటికే సగానికి పైగా విత్తనాలు విత్తుకున్నారు. కొన్నిచోట్ల సకాలంలో వర్షాలు పడకపోవడంతో విత్తిన విత్తనాల్లో 20 శాతం వరకు మొలకెత్తలేదు. దీంతో మరోసారి విత్తనాలు విత్తేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8.49 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశముంది. కాల్వలు, బోర్లు, బావుల కింద మాత్రమే వరి సాగు కానుంది. పూర్తిస్థాయి వర్షం పడితేనే మడులు సిద్ధం అయ్యే అవకాశం ఉండటంతో కొంతమంది రైతులు ఇప్పటికే నార్లు పోసి పెట్టుకున్నారు.

నల్లగొండ జిల్లాలో 11.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా. ఇందులో 6,97,500 ఎకరాల్లో పత్తి, 3.30 లక్షల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో కంది, పెసర పంటలు, మరో 3 వేల ఎకరాల్లో నూనె ఉత్పత్తుల పంటలు సాగు కానున్నాయి. అందుకు సంబందించి విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. డీఏపీ 36,126 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 65,594 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 28,385 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 14,455 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాల్సి ఉంది. ఇప్పటివరకు అన్ని ఎరువులు కలిపి 27,046 మెట్రిక్ టన్నులు మాత్రమే సిద్ధంగా ఉన్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలో వానాకాలం 3.54 లక్షల ఎకరాల్లో పంటల సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 1,91,425 ఎకరాల్లో పత్తి, 1,36,980 ఎకరాల్లో వరి, 3320 ఎకరాల్లో మొక్కజొన్న, 1660 ఎకరాల్లో జొన్న, 29,085 ఎకరాల్లో పప్పుదినుసులు, 401 ఎకరాల్లో నూనె గింజలు, 600 ఎకరాల్లో తృణ ధాన్యాలు సాగుకానున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈ పంటల సాగుకు 53,233 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ప్రస్తుత జిల్లాలో 10,331 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 6,48,125 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది వానాకాలంలో 4.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ప్రస్తుత సీజనుకు సంబంధించి జిల్లాలో 3,82,500 ఎకరాల్లో వరి పంట అధికంగా సాగవుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 6.48 లక్షల ఎకరాల్లో సాగయ్యే పంటల కోసం 13,872 టన్నుల యూరియా, 8397 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 1280 టన్నుల డీఏపీ బఫర్ స్టాక్ అధికారులు అందుబాటులో ఉంచారు



Next Story