చైనాకు భారత్ మరోసారి షాక్

by  |
చైనాకు భారత్ మరోసారి షాక్
X

న్యూఢిల్లీ: చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది. తాజాగా, 47 చైనా యాప్‌లను కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ నిషేధించింది. ఈ యాప్‌ల జాబితాను సర్కారు త్వరలో విడుదల చేయనుంది. అంతేకాదు, పబ్జీ, అలీబాబాకు చెందిన అప్లికేషన్ సహా 250 యాప్‌లపైనా నిషేధం విధించే యోచన ఉన్నట్టు తెలిసింది. కొన్ని యాప్‌ల ఆపరేషన్ ఎథిక్స్‌వల్లే సమస్య అని కేంద్ర ఐటీ శాఖవర్గాలు తెలిపాయి. సమాచారాన్ని చైనాకు చేరవేడాన్ని పరోక్షంగా ఉటంకిస్తూ ఆపరేషన్ ఎథిక్స్ ఇలాగే ఉంటే వాటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించాయి.

ఇది ఎప్పుడూ కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్నాయి. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, క్యామ్‌స్కానర్‌ సహా 59 అప్లికేషన్‌లను గతనెల 29న భారత ప్రభుత్వం ఐటీ యాక్ట్ సెక్షన్ 69ఏ కింద నిషేధించిన సంగతి తెలిసిందే. డేటా చౌర్యం, చైనా ఏజెన్సీలకు సమాచారాన్ని చేరవేత, దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పుగా ఏర్పడే అవకాశమున్నదన్న రిపోర్టుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా, నిషేధిత 59 యాప్‌లకు ‘క్లోన్‌’లుగా ఉన్నవాటిని గుర్తించి వేటు వేసినట్టు తెలిసింది. ఈ క్లోన్‌లు పాత అప్లికేషన్‌లలాగే భారత యూజర్ల డేటాను చైనా ఏజెన్సీలకు చేరవేస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి.

టెన్సెంట్‌కు చెందిన పబ్జీ, షావోమీకి చెందిన జిలి, అలీబాబా గ్రూప్ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ అలీఎక్స్‌ప్రెస్‌లూ భారత చట్టాలను ఉల్లంఘిస్తూ సమాచారాన్ని చేరవేస్తున్నట్టు సమాచారం. ఈ యాప్స్ సహా 250 అప్లికేషన్‌ల జాబితాను రూపొందించినట్టు తెలిసింది. ఈ 250 యాప్స్‌పై ఏ క్షణంలోనైనా వేటుపడొచ్చని తెలుస్తోంది. చైనాతో సరిహద్దులో నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతనెల 59 చైనా యాప్‌లను తొలగించింది. భారత్‌లో భారీ మార్కెట్ ఉన్న ఈ యాప్‌లపై వేటుపడటంతో చైనా ప్రభుత్వమూ స్పందించింది. నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది.


Next Story

Most Viewed