జాగ్రత్త.. మీరు కదిలితే మాకు తెలిసిపోతది!

by  |
జాగ్రత్త.. మీరు కదిలితే మాకు తెలిసిపోతది!
X

దిశ, న్యూస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి బారిన పడిన వారి పర్యవేక్షణ కోసం రక్ష‌ణ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ డీఆర్‌డీఓ, తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్(టీటా)లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రోగుల విష‌యంలో ఆటోమేటెడ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ రూపొందించి వారి కదలికలను విష‌యాల‌ను పర్యవేక్షించనున్నాయి. స్మార్ట్ ఆటోమేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పేషెంట్స్ మ‌రియు రిస్క్స్(సంప‌ర్క్) పేరుతో డీఆర్‌డీఓ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా క్వారంటైన్, ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారిని ప‌ర్య‌వేక్షించ‌వ‌చ్చు. ఈ సాఫ్ట్‌వేర్ అమ‌లు కోసం డీఆర్‌డీఓకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ ఏఐ రోబోటిక్స్ సైంటిస్ట్ డాక్ట‌ర్ రితురాజ్ కుమార్‌, టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల ఈ ఒప్పంద ప‌త్రాల‌ను ఆన్ లైన్ లో సోమవారం మార్చుకున్నారు. త్వర‌లో రాష్ట్రంలోని ఏదైనా ఒక జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు రూపంలో అమ‌లు చేయ‌నున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తిలో భాగంగా ఇత‌రుల‌కు సోక‌డాన్ని నివారించ‌డం ప్ర‌ధాన‌మైన అంశం. అయితే కొన్ని ఉదంతాల్లో ఐసోలేష‌న్, క్వారంటైన్‌లో ఉన్న వారు యథేచ్ఛగా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిరుగుతున్నారు. ఇలాంటి వారి గురించి నిరంతరం ప‌ర్య‌వేక్షించ‌డం పోలీసులకు భారంగా మారింది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు డీఆర్‌డీఓ ‘సంపర్క్‌’ను రూపొందించింది.

కదలికల గుర్తింపు..

జియోఫెన్సింగ్‌, ఫేస్ రిక‌గ్నిష‌న్‌, మ్యాప్‌లో ఉన్న డాటా ఆధారంగా పోలీస్‌, వైద్యారోగ్య విభాగాలు క్వారంటైన్, ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారి క‌ద‌లిక‌ల‌ను గుర్తించ‌వ‌చ్చు. ఈ కృత్రిమ మేథస్సు ఆధారిత ఇంట‌ర్ఫేస్ నిర్వ‌హ‌ణ‌లో భాగంగా రోగి పేరు, సెల్ ఫోన్ నంబ‌రు, ఫోన్ ఐఎంఈఐ నంబ‌రు, క్వారంటైన్ లొకేష‌న్‌, క్వారంటైన్ కాల‌ప‌రిమితి, ఈ-మెయిల్ ఐడీ, ఫొటో వంటివి స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది. ఈ యాప్‌ను పేషెంట్‌కు సంబంధించిన స్మార్ట్‌ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తి ప‌ది నిమిషాల‌కోసారి కోవిడ్ స‌ర్వ‌ర్‌కు అలెర్ట్ అంద‌జేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స‌ర్వీస్‌గా ఉండే ఈ యాప్ ద్వారా రోగులు సంప‌ర్క్ యాప్‌కు సెల్ఫీలు సైతం పంపించొచ్చు. రోగి జియోఫెన్సింగ్ ప్రాంగ‌ణాన్ని వ‌రుస‌గా నాలుగుసార్లు ఉల్లంఘించిన‌ట్లైతే స్మార్ట్‌ఫోన్ ద్వారా హెచ్చరిక సందేశం పంపిస్తుంది. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌మ‌ర్పించిన సెల్ఫీకి, అనంత‌రం ఇచ్చిన సెల్ఫీకి మ‌ధ్య పొంత‌న లేక‌పోయినా ఈ యాప్ అలెర్ట్ ఇస్తుంది. ఇలాంటి ఉల్లంఘనుల వివరాలు రెడ్ సింబ‌ల్ ద్వారా కనిపిస్తుంది. క్వారంటైన్ గ‌డువు ముగిసిన అనంత‌రం పేషెంట్ ఈ యాప్‌ను తొల‌గించుకోవ‌చ్చు. ఈ సంద‌ర్భంగా రితురాజ్ మాట్లాడుతూ టీటా క్షేత్ర‌ స్థాయిలో అందిస్తున్న సేవ‌ల‌ను గ‌మ‌నించి ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు అమ‌లుకు భాగ‌స్వామ్యంగా ఎంచుకున్నామ‌ని తెలిపారు. టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల మాట్లాడుతూ డీఆర్‌డీఓ రూపొందించిన ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుకు టీటాను భాగ‌స్వామ్య సంస్థ‌గా ఎంచుకోవ‌డం తమకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నామన్నారు. క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో తాము ప్ర‌జ‌ల‌కు వివిధ రూపాల్లో సేవ‌లు అందించామని తెలిపారు. సునీల్ చౌగులే, విలియ‌మ్ భావ‌నే, టీటా కార్పొరేట్ సెక్ర‌ట‌రీ అజాస్ హుస్సేన్‌, జీడ‌బ్ల్యూసీ స‌భ్యుడు శ్రీ‌కాంత్ ఉప్పల ఈ ప్రాజెక్టుకు స‌హ‌క‌రించారు.


Next Story