కోతులు వాపస్ పోవాలంటే.. అవి ఏర్పాటు చేయాలి

by  |
కోతులు వాపస్ పోవాలంటే.. అవి ఏర్పాటు చేయాలి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: అడవులు, వాటిలో నివాసముండే వన్య ప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో కోతుల కోసం ఏర్పాటు చేసిన వానర వనం(మంకీస్ ఫుడ్ కోర్ట్ ) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వానలు బాగా కురవాలంటే.. చెట్లు బాగా పెంచాలని పిలుపునిచ్చారు.

కోతులు వాపసు పోవాలంటే.. వానర వనాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సత్తుపల్లిలో పోలీసులు వానర వనం ఏర్పాటు చేశారని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వానర వనం ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అన్నారు. ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశానుసారం ఈ వనం ఏర్పాటు చేసిన పోలీసులను ఆయన అభినందించారు.

సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న రెండెకరాల స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్ది, 300 వరకు వివిధ రకాల పండ్ల మొక్కలు నాటడానికి కృషిచేసిన సత్తుపల్లి ఏసీపీ వెంకటేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఇతర పోలీస్ సిబ్బందిని సండ్ర ప్రశంసించారు. మానవుడు తన స్వార్ధ ప్రయోజనాల కోసం అడవులను ధ్వంసం చేయడంతో… అడవుల్లో ఉండాల్సిన కోతులు తమ ఆహారం కోసం గ్రామాల వైపు రావడం ద్వారా ఇళ్ళ మీద పడటం, పంట ధ్వంసం చేయడం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వానర వనాలు ఏర్పాటుకు పూనుకుందన్నారు.


Next Story