గాంధీకి వెళ్తే శవమవుతున్నారు

by  |
గాంధీకి వెళ్తే శవమవుతున్నారు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో వైద్యం కరువైందని, కరోనా బాధితులు గాంధీ ఆస్పత్రికి వెళ్తే శవమైపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సంఘటనలను వెల్లడించారు. రెండ్రోజుల క్రితం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి నుంచి కరోనా పేషెంట్‌ని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారని, కానీ నేను గాంధీకి రిఫర్ చేయొద్దని సూపరిండెంట్‌కు చెప్పినా అదేరోజు పంపించారన్నారు. గాంధీకి వెళ్లిన పేషెంట్ బుధవారం మరణించారని, గాంధీకి వెళ్తే శవమై వస్తామని ప్రజలు భయపడుతున్నారన్నారు.

కాంగ్రెస్ కౌన్సిలర్ సైతం గాంధీకి పంపించిన తర్వాతే చనిపోయిందని జగ్గారెడ్డి గుర్తుచేశారు. అధికారులు, మంత్రి, సంగారెడ్డి నియోజకవర్గంలో 100పడకల హాస్పిటల్‌ని ప్రారంభించామని గొప్పలు చెప్పుకున్నారని, అలాగే మంచి భోజనం ఏర్పాటు చేశామన్నారని, కానీ ఎక్కడ మంచి భోజనముందని ప్రశ్నించారు. కనీసం ఆస్పత్రిలో ఒక డాక్టర్‌ని పెట్టాలనే ఆలోచన చేయలేదని, ఆస్పత్రిలో తక్షణమే వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ టీఆర్ఎస్ కార్యాలయంగా మారిందని ఆరోపించారు. సంగారెడ్డికి చెందిన శ్రీనివాస్ తల్లి చనిపోవడానికి కేవలం ప్రభుత్వమే కారణమని, తనపై ఎన్నికేసులు పెట్టినా మృతదేహంతో ప్రభుత్వ ఆస్పత్రి లేదా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానన్నారు.


Next Story