‘కరోనా పాజిటివ్‌కు గల కారణాలను విశ్లేషించండి’

by  |
‘కరోనా పాజిటివ్‌కు గల కారణాలను విశ్లేషించండి’
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో.. పాజిటివ్ రావడానికి సంబంధించిన కారణాలను విశ్లేషించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి వెపూర్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామస్తులతో మంత్రి మాట్లాడారు. ముంబాయి నుంచి గ్రామానికి 250 మంది వచ్చారని, వీరందరికీ తక్షణమే కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే వెంటనే హైదరాబాద్ తరలించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని, అదేవిధంగా గ్రామం నుంచి బయటకు వెళ్లే వారిని జాగ్రత్తగా గమనించాలన్నారు. గ్రామంలో జ్వరం, దగ్గు కోసం మెడికల్ షాపుల ద్వారా మందులు కొన్న వారిని ఆరా తీయాలని, ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద ఇటీవల కాలంలో జలుబు, దగ్గు జ్వరం కోసం ఎవరైనా చికిత్స తీసుకున్నట్టయితే వారిని గుర్తించాలని, రెండ్రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో కిరాణా షాపులు, మార్కెట్, కూరగాయల దుకాణాలు మూసివేయాలని, గ్రామానికి అవసరమైన కూరగాయలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని అన్నారు. అనంతరం మంత్రి సంచార కూరగాయల వాహనాన్ని ప్రారంభించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శశికాంత్ తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed